Begin typing your search above and press return to search.

2021లో ఎక్కువమంది ఇష్టపడిన పాటలు ఇవే!

By:  Tupaki Desk   |   27 Dec 2021 2:51 AM GMT
2021లో ఎక్కువమంది ఇష్టపడిన పాటలు ఇవే!
X
పరిమళింపజేయడం .. పరవశింపజేయడం పాట లక్షణం. మధురమైన పాట మనసుకు ఊతాన్ని ఇస్తుంది .. ఉత్సాహాన్ని తెస్తుంది. ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోయామనే ఫీలింగ్ కలిగినప్పుడు పాట తోడుగా మారిపోతుంది .. నీడలా వెన్నంటి వస్తుంది .. ఓదార్పునిస్తుంది. ఎడారిలోనైనా .. ఏకాంతంలోనైనా మనసుకు పాటని మించిన తోడు మరొకటి ఉండదు. అందుకే మంచి పాటలకు మనసు మంచినీటి సరస్సులా మారిపోతూ ఉంటుంది. అలాంటి పాటలు వినిపించే చోటుకు మనసులన్నీ తుమ్మెదలై చేరిపోతూ ఉంటాయి.

అందువల్లనే సినిమాల్లో తెరపై పాట కనిపించేది 5 నిమిషాలే అయినా, అది చూపించే ప్రభావం ఎక్కువ. కథను థియేటర్లో వదిలేసి వచ్చేసినంత తేలికగా పాటను వదిలేసి రాలేరు. అదే పాటకి ఉన్న ప్రత్యేకత .. అందుకే దానికి అంతటి ప్రాధాన్యత. కరోనా కారణంగా ఈ ఏడాది థియేటర్లకు వచ్చిన సినిమాల సంఖ్య చాలా తక్కువే. వచ్చిన సినిమాల్లో నచ్చిన పాటలను ఏరితే పాయసంలో జీడిపప్పులా కొన్ని మాత్రమే దొరుకుతాయి. అలా ఈ ఏడాదిలో మనసు తలుపులను ఎక్కువగా తట్టిన పాటలేమిటనేది ఒకసారి చూద్దాం.

సాధారణంగా పాటలన్నీ కూడా ప్రేమ చుట్టూనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అలా 'శశి' సినిమాలోని 'ఒకే ఒక లోకం నువ్వే' అనే పాట యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అరుణ్ చిలువేరు స్వరపరిచిన ఈ పాటకు సిద్ శ్రీరామ్ ప్రాణం పోశాడు. కాలేజ్ కుర్రాళ్ల నాల్కలపై ఎక్కువగా నానిన పాట ఇది. ఆది సాయికుమార్ - సురభి నాయకా నాయికలుగా అలరించారు. ఇక నితిన్ - కీర్తి సురేశ్ కాంబినేషన్లో వచ్చిన 'రంగ్ దే'లోని 'నా కనులు ఎపుడూ కననే కననీ' పాటకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దేవిశ్రీ ప్రసాద్ బాణీ కట్టిన ఈ పాటతో సిద్ శ్రీరామ్ ఖాతాలోకి మరో మంచి పాట చేరిపోయింది.

ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగధరియా' పాటకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. మంగ్లీ పాడిన ఈ జానపద గీతానికి సాయిపల్లవి డాన్స్ కూడా తోడవడంతో ఈ పాట ఎక్కడికో వెళ్లిపోయింది. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాటకి ఎంతమంది 'రీల్స్' చేసి వదిలారో లెక్కేలేదు. ఇక 'ఏ కన్నులు చూడని చిత్రమో' పాట కూడా ఎక్కువమంది విన్న పాటల జాబితాలో చేరిపోయింది. 'అర్థ శతాబ్దం' సినిమాలోని ఈ పాటకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక 'జలజల జలపాతం నువ్వు' అనే పాట జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. 'ఉప్పెన' సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ పాటకి, పడుచు మనసులన్నీ కూడా పడవల్లా ఊగిపోయాయి.

'భీమ్లా నాయక్' సినిమాలోని 'అంత ఇష్టమేందయ్యా' అనే పాటకి కూడా మంచి ఆదరణ లభించింది. నిత్యామీనన్ - పవన్ పై చిత్రీకరించిన ఈ పాటను చిత్ర పాడటం విశేషం. జానపద శైలిలో తమన్ స్వరపరిచిన ఈ పాట, ఒక అందమైన అనుభూతిని ఆవిష్కరిస్తూ మనసులు దోచేసుకుంది. 'జాతిరత్నాలు' సినిమాలో 'చిట్టీ నవ్వంటే లక్ష్మీ పటాసే' కూడా ఒక రేంజ్ లో సందడి చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు. ఇక 'నల్లమల' సినిమాలోని 'లేత లేగదూడ పిల్ల .. ' అనే పాటకి కూడా శ్రోతల నుంచి మంచి ఓట్లు పడిపోయాయి. హృదయ సింహాసనంపై పాలాభిషేకం జరుపుకున్న మధురమైన ఈ పాటలను మరొక్కసారి వింటూ, న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టేయండి మరి.