Begin typing your search above and press return to search.

ఏడు రీమేకులు తీసిన నాకే కిక్కిచ్చింది

By:  Tupaki Desk   |   12 Aug 2016 8:17 AM GMT
ఏడు రీమేకులు తీసిన నాకే కిక్కిచ్చింది
X
అతగాడేమో ఊరందరి సినిమాలనూ రీమేక్ చేశాడు. అయితే అవన్నీ చేసి చేసి చివరకు సొంతంగా తను ఒక ఒరిజనల్ సినిమాను తీశాడు. అది బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమాను ఇప్పుడు ఇంకొకరు రీమేక్ చేయడం చాలా థ్రిలింగ్ గా ఉందంటున్నాడు.

తమిళంలో తన తమ్మడు 'జయం' రవి ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు మోహన్‌ రాజా.. బాగానే పాపులర్. కాకపోతే అతగాడు ఏకంగా వరుసగా ఏడు రీమేక్ సినిమాలు తీశాడు తెలుసా? హనుమాన్ జంక్షన్ - జయం - అమ్మా నాన్న ఓ తమిళమ్మాయ్ - నువ్వొస్తానంటే నేనొద్దంటానా - బొమ్మరిల్లు - కిక్ - ఆజాద్.. ఒకటి తెలుగులో.. మిగిలినవి తమిళంలో.. ఇలా ఏడు సినిమాలను రీమేక్ చేసిన మోహన్ రాజా.. ఆ తరువాత సొంతంగా తానే ఒక కథ రాసుకుని తీసిన సినిమా ''థని ఒరవున్‌''. దానినే తెలుగులో ''ధృవ'' అంటూ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ''ఈ సినిమా ప్రీ-లుక్ చూశాను. అదిరిపోయింది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఏడు రీమేకు సినిమాలు తీసిన నాకు.. నా సినిమాను ఇంకొకరు రీమేక్ చేస్తే ఎలా ఉంటుందా అనుకున్నాను.. కాని ఫుల్ కిక్కిచ్చారు ధృవ టీమ్'' అంటున్నాడు మోహన్ రాజా.

అన్నేసి రీమేక్ సినిమాలను చేసిన డైరక్టర్.. ఇప్పుడు తన సినిమా రీమేక్ అవుతుంటే నిజంగానే కిక్ ఫీలవుతాడులే. అయితే ఈ సినిమా రీమేక్ కూడా తానే చేసుంటే మరో రీమేక్ తన ఖాతాలో పడుండేది కాని.. అప్పటికే వేరే సినిమాకు కమిట్ అయిన మోహన్ రాజా.. తనే స్వయంగా చరణ్‌ తో సినిమా చేసే ఛాన్సును వదులుకున్నాడని టాక్‌.