Begin typing your search above and press return to search.

చరణ్ సినిమాకు సీక్వెల్ ఉంది

By:  Tupaki Desk   |   28 Aug 2018 2:30 PM GMT
చరణ్ సినిమాకు సీక్వెల్ ఉంది
X
రొడ్డకొట్టుడు మాస్ మసాలా సినిమాలతో సాగిపోతున్న రామ్ చరణ్‌ ను సరికొత్తగా ఆవిష్కరించిన సినిమా ‘ధృవ’. ‘బ్రూస్ లీ’ లాంటి పెద్ద డిజాస్టర్ తర్వాత వచ్చిన ఈ చిత్రం చరణ్ కు గొప్ప ఉపశమనాన్నిచ్చింది. చరణ్ నుంచి ఇలాంటి విభిన్నమైన సినిమాను ఆశించే పరిస్థితి లేదు అప్పటికి. చరణ్ ను ఇలాంటి సినిమాలో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలకు తెరదించుతూ ‘ధృవ’ మంచి విజయాన్నే అందుకుంది. ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగువాడైన జయం రవి హీరోగా అతడి అన్నయ్య మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అప్పటిదాకా ఎక్కువగా రీమేక్‌ సినిమాలే చేస్తూ వచ్చిన మోహన్ రాజాపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ ‘తనీ ఒరువన్’ లాంటి సెన్సేషనల్ థ్రిల్లర్ తో అతను కోలీవుడ్ కు పెద్ద షాకే ఇచ్చాడు.

‘తనీ ఒరువన్’ బ్లాక్ బస్టర్ అయి మోహన్ రాజాను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. దీని తర్వాత ‘వేలైక్కారన్’తో మంచి మంచి హిట్ కొట్టిన మోహన్ రాజా.. ఇప్పుడు ‘తనీ ఒరువన్’ సీక్వెల్ కు రెడీ అయిపోయాడు. ‘తనీ ఒరువన్’ రిలీజై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అతను ట్విట్టర్లో ఒక వీడియో ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేశాడు. ‘తనీ ఒరువన్’ తనకు ఎనలేని గౌరవాన్ని తెచ్చి పెట్టిందని.. ప్రేక్షకులకు తనపై గొప్ప అభిమానాన్ని చూపించారని.. వారి ఆశీస్సులతో దీని సీక్వెల్ పనులు మొదలుపెడుతున్నానని అతనన్నాడు. మోహన్ రాజా మాట్లాడుతుండగానే.. సీన్లోకి జయం రవి వచ్చేశాడు. తానే సీక్వెల్లోనూ హీరో అన్నాడు. ‘తనీ ఒరువన్’ కంటే ఇంకా మెరుగ్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నిస్తామని అన్నదమ్ములు చెప్పారు. మరి ‘తనీ ఒరువన్’కు ప్రధాన బలంగా నిలిచిన అరవింద్ స్వామి.. సీక్వెల్లోనూ ఉంటాడా లేదా అన్నది సస్పెన్స్. ఈ చిత్రంలో తెలుగులోనూ రీమేక్ అవుతుందా.. అయితే రామ్ చరణ్-సురేందర్ రెడ్డి కలిసే ఈ సీక్వెల్ చేస్తారా అన్నది కూడా ఆసక్తికరం.