Begin typing your search above and press return to search.

సోనూసూద్‌ తో పాటు ఈమెకు అన్యాయం

By:  Tupaki Desk   |   30 Jan 2019 12:57 PM GMT
సోనూసూద్‌ తో పాటు ఈమెకు అన్యాయం
X
కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మణికర్ణిక' చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువగా క్రిష్‌ చేశాడు. కాని క్రిష్‌ కు క్రెడిట్‌ దక్కకుండా కంగనా చేసిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. క్రిష్‌ ఇప్పటికే జాతీయ మీడియా ముందుకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని, మణికర్ణిక క్రెడిట్‌ తనకు దక్కకుండా చేసిందని, తాను చేసిన సినిమాలోని పలు సీన్స్‌ మార్చి, సినిమాను ఆగం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ చిత్రంలో సోనూసూద్‌ పాత్రను క్రిష్‌ అద్బుతంగా మలిచాడట. కాని కంగనా మాత్రం అసలు ఆ పాత్ర నుండి సోనూసూద్‌ ను తొలగించి మరో నటుడిని పెట్టింది.

మణికర్ణిక చిత్రంలో సోనూసూద్‌ పాత్రను పూర్తిగా మార్చేసిన కంగనా మరో పాత్రను కూడా మార్చేసిందట. సినిమాలోని కాశీభాయి పాత్ర పోషించిన మిష్టి చక్రవర్తి కూడా కంగనాపై విమర్శల వర్షం కురిపించింది. క్రిష్‌ గారు తన పాత్రను చాలా బాగా మలిచారు. తప్పకుండా సినిమాతో నాకు గుర్తింపు వస్తుందని భావించాను. క్రిష్‌ గారు మంచి సీన్స్‌ ను నాపై చిత్రీకరించారు. కాని కంగనా మాత్రం నా పాత్రను చాలా వరకు తగ్గించిందని, క్రిష్‌ ఈ చిత్రంకు ఎక్కువగా వర్క్‌ చేశాడని, కంగనా కొన్ని మార్పులు చేర్పులు మాత్రమే చేసిందని మిష్టి చక్రవర్తి కూడా చెప్పుకొచ్చింది.

ఇప్పటికే మణికర్ణిక విషయంలో కంగనా విమర్శలు ఎదుర్కొంటోంది. క్రిష్‌ కు మెల్ల మెల్లగా మద్దతు పెరుగుతూ వస్తోంది. ఇటీవలే పూజా భట్‌ ఈ చిత్రం విషయంలో క్రిష్‌ కు మద్దతుగా మాట్లాడింది. ఇక సోనూ సూద్‌ మరియు మిష్టి చక్రవర్తి కూడా క్రిష్‌ వైపే ఉన్నారు. మెల్ల మెల్లగా క్రిష్‌ కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో వివాదం ముదురుతోంది. అయితే కంగనా మాత్రం ఈ విషయాలను పట్టించుకోకుండా సక్సెస్‌ ను ఎంజాయ్‌ చేస్తోంది.