Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో పేలుతున్న కామెడీ మీమ్స్

By:  Tupaki Desk   |   23 May 2019 5:30 PM GMT
సోషల్ మీడియాలో పేలుతున్న కామెడీ మీమ్స్
X
ఇది నిజంగా చరిత్రాత్మకమే. 175 స్థానాల్లో 150కి పైగా గెలవడమంటే మాటలా? అందునా హోరాహోరీ సమరం ఖాయం అనుకున్న ఎన్నికల్లో ఇలాంటి విజయం అంటే అసాధారణం. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఈ ఉత్సాహాన్ని సోషల్ మీడియాలో బాగానే చూపిస్తున్నారు పార్టీ ఫ్యాన్స్. వైకాపా అభిమానులనే కాదు.. చంద్రబాబును వ్యతిరేకించే తటస్థులు కూడా అదిరిపోయే కామెడీ మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందులో బాగా వైరల్ అవుతున్నది కేసీఆర్ చంద్రబాబుకు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ మీమే. అందులో కేసీఆర్ బాబుకి జగన్ ఫొటోను ఇస్తున్నట్లుగా ఉంది. ఈ మీమ్ ఇన్‌స్టంట్‌గా పేలింది. మరోవైపు చంద్రబాబు ఇచ్చిన పసుపు కుంకుమను తీసుకున్న మహిళలు ఆయనకు ఉప్పు కారం రాశారంటూ ఒక మీమ్ తయారుచేశారు.

ఇక రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఒక పేరడీ వీడియో కూడా భలేగా పేలుతోంది. అసెంబ్లీలో ఆ మధ్య బాబు మోడీ సర్కారు మీద విరుచుకుపడుతూ ఒక స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వాయిస్‌తో పేరడీ చేసి దీన్ని చాలా ఫన్నీగా తయారు చేశారు. ‘‘కాదండీ ఆవేదన ఉండదాండీ. ఒకేసారి 175 నియోజకవర్గాల్లో ఫలితాలు ప్రకటిస్తే ఎలాగండీ’’ అంటూ బాబు ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది అందులో. మరోవైపు సైకిల్ తుక్కు తుక్కు అయి ఉంటే దాని ముందు కూలబడ్డట్లుగా మరో మీమ్ తయారు చేశారు. ఆ మధ్య చంద్రబాబు పోలికలతో ఒక వ్యక్తి హోటల్లో సర్వ్ చేస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు పరిస్థితి ఇదేనంటూ దాన్ని షేర్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇలా పలు రకాలుగా చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.