Begin typing your search above and press return to search.

ముంబై స్టూడియోలో మెగాస్టార్‌, స‌ల్మాన్ హ‌ల్ చ‌ల్

By:  Tupaki Desk   |   14 March 2022 7:30 AM GMT
ముంబై స్టూడియోలో మెగాస్టార్‌, స‌ల్మాన్ హ‌ల్ చ‌ల్
X
మెగాస్టార్ చిరంజీవి మునుపెన్న‌డూ లేన‌విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. `సైరా స‌ర‌సింహారెడ్డి` త‌రువాత ఆయ‌న వ‌రుస‌గా ఐదు చిత్రాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఇందులో ఇప్ప‌టికే `ఆచార్య‌` చిత్రీక‌ర‌ణ‌ పూర్త‌యి ఏప్రిల్ 29న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

మ‌రి కొన్ని చిత్రాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. కొన్ని ఇప్పుడిప్పుడే పట్టాలెక్కాయి. అందులో మ‌ల‌యాళ హిట్ చిత్రం `లూసీఫ‌ర్‌` ఆధారంగా తెర‌కెక్కుతున్న `గాడ్ ఫాద‌ర్‌` ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మోహ‌న్‌ రాజా ఈ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రారంభించిన ద‌గ్గ‌రి నుంచి ఈ చిత్రం వార్త‌ల్లో నిలుస్తోంది. యంగ్ హీరో స‌త్య‌దేవ్ ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆర్‌. బి. చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో ఎఎన్‌. వి. ప్ర‌సాద్ ప‌రాస్‌ జైన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే కొంత షూటింగ్ జ‌రుపుకుంది. యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈమూవీలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు.

వీళ్లిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నున్నాయ‌ట‌. అందుకే వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌ని చాలా ప్ర‌త్యేకంగా షూట్ చేయాల‌ని ప్లాన్ చేశారు. ముంబైలో ఈ రోజే వీరిద్ద‌రికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ఇటీవ‌లే ముంబై వెళ్లిన మెగాస్టార్ .. స‌ల్మాన్ ఖాన్ ఫామ్‌ హౌస్ లో వున్నార‌ని, అక్క‌డే షూటింగ్ చేస్తున్నారంటూ ఇటీవ‌ల వార్త‌లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం స‌ల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో ఎలాంటి షూటింగ్ చేయ‌డం లేద‌ని తెలిసింది.

మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాలని ముంబై స‌మీపంలో గల క‌జ‌రత్ లో వున్న ఎన్ డీ స్టూడియోలో చిత్రీక‌రిస్తున్నారు. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఆ స్టూడియోలో సెట్ ని నిర్మించార‌ట‌. అందులోనే చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ ల మ‌ధ్య స‌న్నివేశాల‌ని సోమ‌వారం నుంచి చిత్రీక‌రించ‌డం మొద‌లుపెట్టార‌ని తెలిసింది. మెగాస్టార్ తో గ‌త కొన్నేళ్లుగా స‌ల్మాన్ ఖాన్ మంచి అనుబంధాన్ని క‌లిగివున్నారు. ఆ కార‌ణంగానే `గాడ్ ఫాద‌ర్‌`లోని కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ట‌.

భారీ అంచ‌నాల మ‌ధ్య యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి స‌రికొత్త మేకోవ‌ర్ తో కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇందులో చిరుకు సోద‌రిగా న‌య‌న‌తార క‌నిపించ‌నుంద‌ని, మ‌ల‌యాళ చిత్రంలో మంజు వారియ‌ర్ పోషించిన కీల‌క పాత్ర‌లో న‌య‌న‌తార క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.