Begin typing your search above and press return to search.

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు మెగా హీరో సినిమా..?

By:  Tupaki Desk   |   6 May 2021 8:45 AM GMT
డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు మెగా హీరో సినిమా..?
X
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్ళు రాబట్టి డెబ్యూ హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఈ క్రేజ్ తో క్రిష్ తో చేస్తున్న రెండో సినిమా భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుందని అందరూ అనుకున్నారు. నిజానికి 'ఉప్పెన' సెట్స్ పై ఉండగానే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ కంటెంట్ బేస్డ్ మూవీ స్టార్ట్ చేసాడు వైష్ణవ్. కోవిడ్ టైంలో ప్రారంభమైన ఈ చిత్రాన్ని శరవేగంగా షూట్ చేసి కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేశారు.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన 'కొండపొలం' నవల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. రాజీవ్ రెడ్డి - జాగర్లమూడి సాయిబాబా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి 'జంగిల్ బుక్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 'ఉప్పెన' సినిమా సూపర్ హిట్ అవడంతో వైష్ణవ్ రెండో సినిమాపై అందరి దృష్టి పడింది. దీన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన మేకర్స్.. వీలైనంత త్వరగా క్రిష్ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అదే సమయంలో మహమ్మారి వైరస్ ఎఫెక్ట్ పడి ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో సినీ పరిశ్రమ మళ్లీ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల వాయిదా వేసుకోగా.. మరికొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్రిష్ - వైష్ణవ్ కాంబోలో రూపొందుతున్న చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పుడప్పుడే థియేట్రికల్ రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో.. ఓటీటీల నుంచి వచ్చే ఫ్యాన్సీ డీల్ కి మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.