Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాదర్' సెట్లో మళ్లీ మొదలైన మెగా సందడి!

By:  Tupaki Desk   |   9 Feb 2022 3:30 PM GMT
గాడ్ ఫాదర్ సెట్లో మళ్లీ మొదలైన మెగా సందడి!
X
కరోనా అందరినీ కంగారు పెడుతున్న సమయంలో .. అందరినీ ఇంటుపట్టునే ఖాళీగా కూర్చోబెడుతున్న సమయంలోనే చిరంజీవి వరుస కథలను సెట్ చేసుకున్నారు. కరోనా కాస్త సడలింపు ఇవ్వగానే చిరంజీవి రంగంలోకి దిగిపోయారు. తాను ఓకే చేసిన కథలను ఒక్కొక్కటిగా పట్టాలెక్కించారు. ఈ సినిమాలన్నీ కూడా కథాకథనాల పరంగా .. బడ్జెట్ పరంగా భారీతనాన్ని సంతరించుకున్నవి కావడం విశేషం. ఒక్కో సినిమా ఒక్కో జోనర్ కి చెందినది కావడం అందరిలో ఆసక్తిని పెంచే అంశం. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలను పట్టాలపై పరుగులు తీయిస్తున్నారు.

చిరంజీవి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆచార్య' సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. చిరంజీవి సరసన నాయికగా కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. మరో వైపున 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగును పూర్తిచేసే పనిలో చిరంజీవి ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో ఆయన పాల్గొంటున్నారు.

ఇటీవల చిరంజీవికి రెండవసారి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. అందువలన ఆయన కొన్ని రోజులుగా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకి పాజిటివ్ వచ్చిందని ఆయనే చెప్పారు. రీసెంట్ గా ఆయనకి నెగెటివ్ వచ్చింది. దాంతో మళ్లీ ఆయన 'గాడ్ ఫాదర్' షూటింగులో జాయిన్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. చిరంజీవి తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన 'జన జాగృతి' పార్టీకి చెందిన నాయకుడిగా కనిపించనున్నారు.

మలయాళంలో ఆ మధ్య మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా కథాకథనాలు ఎంతో నచ్చడం వలన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చిరంజీవి ఈ సినిమాను చేస్తున్నారు. మలయాళంలో మంజూ వారియర్ చేసిన పాత్రను తెలుగులో నయనతార చేస్తోంది. ఇక మరో కీలకమైన పాత్రను సత్యదేవ్ చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా పూర్తికాగానే చిరంజీవి 'భోళాశంకర్' .. 'వాల్తేర్ వీరయ్య' సినిమాలను కూడా పూర్తి చేయనున్నారు. 'భోళా శంకర్' సినిమాకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా, 'వాల్తేర్ వీర్రాజు' సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నవే. 'భోళాశంకర్'లో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, 'వాల్తేర్ వీర్రాజు' సినిమాలో నాయికగా శ్రుతి హాసన్ పేరు వినిపిస్తోంది. ఈ రెండింటిలో ఒకటి ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.