Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మత్తు వదిలించేలా ఉందే!

By:  Tupaki Desk   |   18 Dec 2019 1:06 PM GMT
ట్రైలర్ టాక్: మత్తు వదిలించేలా ఉందే!
X
కీరవాణి తనయుడు సింహా హీరోగా రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ 'మత్తు వదలరా'. సత్య.. వెన్నెల కిషోర్.. బ్రహ్మాజీ.. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంగీతం అందించినవారు కీరవాణి మరో తనయుడు కాలభైరవ. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది.

ముగ్గురు స్నేహితులు.. మనీ ప్రాబ్లెమ్స్.. ఉద్యోగం చేసినా సరిపోని జీతాలు.. దీనికి తోడు హీరోకు డ్రగ్స్ అలవాటు కూడా ఉంటుంది. ఇలా ఉన్న జీవితాల్లో ఒక ట్విస్ట్ కావాలి కదా? అందుకే ఒక చిన్న సైజ్ దొంగతనం చెయ్యాలని.. హీరోకు సత్య సూచిస్తాడు. అయితే అది కాస్తా ఊహించని విధంగా భారీ దొంగతనంగా మారుతుంది. అందరూ ఇరుక్కుంటారు. లిప్పు లాకులు తప్ప ఈ జెనరేషన్ యూత్ కు క్షణాల్లో కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. డైలాగ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ సింహా ను ఇంటరాగేషన్ లో భాగంగా "నేను అడిగిన వాటికి యస్ ఆర్ నో అని మాత్రమే చెప్పాలి. పేరేమిటి?" అని అడుగుతాడు. సింహా 'యస్' అని చెప్తాడు. పక్కనే ఉన్న సత్య అందుకుని "ఉ.. ఏసు" అని పూర్తి చేస్తాడు.

ఈ ట్రైలర్ లో హైలైట్ ఏంటంటే చివర్లో "నేను మా ఊరెళ్లిపోతా.. మా ఊరెళ్లిపోతా" అంటూ ఉంటాడు. "ఊరెళ్లి ఏం చేస్తావురా?" అంటూ సత్య ప్రశ్నిస్తాడు. దీనికి సమాధానంగా ఫుల్ మత్తులో ఉన్నవాడిలా చిందులేస్తూ "ఏదొకటి చేస్తా కానీ ఉద్యోగం మానేస్తా మానేస్తా మానేస్తా" అంటూ పిచ్చెక్కిస్తాడు. ఈ సీన్ లో సింహా డ్యాన్స్ మూవ్ మెంట్స్ ఎవరినైనా ఫిదా చెయ్యడం ఖాయం. ట్రైలర్ నేపథ్య సంగీతం.. విజువల్స్ అన్నీ ట్రెండీగా ఉన్నాయి. రొటీన్ గా కాకుండా కొత్తదనం కోరుకునేవారికి నచ్చే తరహాలోనే ఉంది. ఆలస్యం ఎందుకు అసలే కీరవాణిగారి అబ్బాయి.. వెంటనే చూసేయండి.