Begin typing your search above and press return to search.

పక్కా కమర్షియల్ డైరెక్టర్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడంటే..!

By:  Tupaki Desk   |   17 May 2021 11:30 PM GMT
పక్కా కమర్షియల్ డైరెక్టర్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడంటే..!
X
వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి 'ఈ రోజుల్లో' 'బస్‌ స్టాప్' వంటి యూత్ ఫుల్ సినిమాలతో మెప్పించాడు. ఆ తర్వాత 'ప్రేమ కథా చిత్రమ్' 'భలే భలే మగాడివోయ్' 'మహానుభావుడు' వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ కి దగ్గరయ్యారు. ఇక 'ప్రతిరోజూ పండగే' సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మారుతి.. చాలా రోజుల గ్యాప్ తర్వాత యాక్షన్ హీరో గోపీచంద్ తో ''పక్కా కమర్షియల్'' అనే కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మారుతి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ సెకెండ్ వేవ్ లాక్ డౌన్ లో కొత్త స్క్రిప్ట్‌ లు రాసుకుంటున్నట్లు దర్శకుడు మారుతి తెలిపారు. వెబ్‌ సిరీస్‌ ల కోసం ఏమైనా స్క్రిప్ట్‌ లు రాస్తున్నారా? అని ప్రశ్నించగా.. ‘త్రీ రోజెస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ కోసం మూలకథని అందించానని.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందని చెప్పారు. ఇప్పుడు తాను రాస్తున్న కథలన్నీ సినిమాల కోసమేనని.. పూర్తిగా కథపైనే దృష్టిపెట్టే ఇలాంటి సమయం మళ్లీ దొరకదని మారుతి చెప్పుకొచ్చారు. అలానే భవిష్యత్తులో నాణ్యమైన సినిమాలు తీయకపోతే కష్టమేనని.. మంచి కాన్సెప్ట్‌ లతో సినిమాలు వస్తున్నాయని మారుతి అన్నారు.

''రీసెంటుగా చూసిన సినిమాలలో ‘సినిమా బండి’ బాగా తీశారనిపించింది. అలా మంచి స్క్రిప్టులతో మరింత బాధ్యతతో సినిమాలు చేయాలి. ప్రస్తుతం నా దృష్టంతా దానిపైనే ఉంది'' అని మారుతి చెప్పుకొచ్చారు. ఇకపోతే డైరెక్టర్ మారుతి ఇటీవల కరోనాతో మరణించిన సినీ జర్నలిస్ట్‌, నటుడు టీఎన్నార్‌ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. యాభై వేల రూపాయలను తక్షణ సాయంగా టీఎన్నార్‌ భార్య అకౌంట్‌ కు ట్రాన్స్‌ఫర్‌ చేసి తన మంచి మనసును చాటుకున్నారు.