Begin typing your search above and press return to search.

నేపాలీ బ్యూటీ ఈజ్‌ బ్యాక్‌ ఎగైన్‌

By:  Tupaki Desk   |   18 March 2015 4:45 AM GMT
నేపాలీ బ్యూటీ ఈజ్‌ బ్యాక్‌ ఎగైన్‌
X
నేపాలీ సౌందర్యం మనీషా కొయిరాలా బాలీవుడ్‌లో ఒకానొక సంచలనం. దశాబ్ధం పైగానే ఉత్తరాది సినీపరిశ్రమని ఏలింది ఈ ముద్దుగుమ్మ. రెబలిజం మనీషా ప్రత్యేకత. అందుకే హిందీ సినీపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకుంది. స్టార్‌ హీరోయిన్లు ఎందరు ఉన్నా తనకి సాటిరారెవరూ అని నిరూపించింది.

90లలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'బొంబాయి' చిత్రం ఓ సంచలనం అయ్యిందంటే అందులో మనీషా కొయిరాలా పాత్రని ఎంతమాత్రం విస్మరించలేం. అద్భుతమైన అభినయంతో యువతరాన్ని కట్టిపడేసింది. నాగార్జున సరసన 'కిల్లర్‌' చిత్రంలో చూసిన తెలుగు కుర్రకారు పరేషాన్‌ అయిపోయారు. తెలుసా మనసా... పాటలో మనీషా చూపించిన తెగువ, రొమాన్స్‌ ఎప్పటికీ కళ్ల ముందు కదులుతూనే ఉంటుంది. అర్జున్‌ సరసన ఒకే ఒక్కడు సినిమాలోనూ అమాయకత్వం నిండిన కళ్లలో మనీషా ప్రదర్శించిన అభినయం అద్భుతం. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో. అయితే ఒకానొక సందర్భంలో ఈ భామ ప్రమాదకర క్యాన్సర్‌ బారిన పడింది. చావుకు దగ్గరగా వెళ్లింది అన్న వార్త అభిమానుల గుండెల్ని చిద్రం చేసింది.

అయితే అనూహ్యంగా క్యాన్సర్‌నే జయించిన మృత్యుంజయురాలిగా మనీషా గెలుపు సాధించింది. ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తోంది. కన్నడలో గేమ్‌ అనే చిత్రం కోసం ముఖానికి రంగేసుకుని ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ చిత్రంలో ఒకే ఒక్కడు ఫేం అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు.