Begin typing your search above and press return to search.

'మనసులోనే నిలిచిపోకే'.. ‘వరుడు కావలెను‘ నుంచి సుమధురమైన గీతం..!

By:  Tupaki Desk   |   22 Sep 2021 11:23 AM GMT
మనసులోనే నిలిచిపోకే.. ‘వరుడు కావలెను‘ నుంచి సుమధురమైన గీతం..!
X
యంగ్ హీరో నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''వరుడు కావలెను''. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని 'మనసులోనే నిలిచిపోకే' అనే మరో పాట లిరికల్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

''మనసులోనే నిలిచిపోకె మైమరపుల మధురిమ.. పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా.. ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం.. అన్ని వైపుల వెనుతరిమే ఈ సంబరం" అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సమకూర్చిన బాణీలకి ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మధురమైన సాహిత్యం అందించారు. ఈ గీతాన్ని గాయని చిన్మయి వీనుల విందుగా ఆలపించారు.

హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు తెర రూపంగా 'మనసులోనే నిలిచిపోకే' గీతం కనిపిస్తుంది. హీరోయిన్ మనోభావాలకు అద్దంపడుతున్న ఈ పాటలో నాగశౌర్య - రీతువర్మ ల అభినయం ఆకట్టుకుంటుంది. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత, సాహిత్యాల కలబోతగా వచ్చిన ఈ పాట చార్ట్ బస్టర్ అవుతుందనడంలో సందేహం లేదు. వంశీ పచ్చిపులుసుల ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు.

'మనసులోనే నిలిచిపోకే' పాట గురించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ''సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. చిన్మయి గారు ఆలపించిన ఈ గీతం మీకు కూడా నచ్చుతుంది. ప్రేక్షకులకు సంగీత ప్రియులకు చాలా కాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హృదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను'' అని అన్నారు.

'వరుడు కావలెను' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది లవ్ అండ్ ఎమోషన్స్ తో కూడిన అందమైన కుటుంబ కథా చిత్రమని.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. నదియా - మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ - అనంత్ - కిరీటి దామరాజు - రంగస్థలం మహేష్ - అర్జున్ కళ్యాణ్ - వైష్ణవి చైతన్య - సిద్దిక్ష తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.