Begin typing your search above and press return to search.

మానాడు' లెక్కలు చెప్పడం లేదని వాపోయిన నిర్మాత..!

By:  Tupaki Desk   |   8 Feb 2022 2:30 PM GMT
మానాడు లెక్కలు చెప్పడం లేదని వాపోయిన నిర్మాత..!
X
తమిళంలో విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన తాజా చిత్రం ''మానాడు''. శింబు - కల్యాణీ ప్రియదర్శన్ - ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. టైం లూప్ కాన్సెప్ట్ తో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో కోవిడ్‌ సమయంలోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే బయ్యర్లు ఈ సినిమా కలెక్షన్స్ వివరాలు ఇవ్వకపోవడంపై నిర్మాత ఆవేదన వ్యక్తం చేసారు.

'మానాడు' చిత్రాన్ని వి హౌస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్ పై ప్రముఖ తమిళ నిర్మాత సురేష్‌ కామాక్షి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వల్ల తమిళ్ లో మాత్రమే విడుదల చేశారు. అయితే ఈ సినిమా వచ్చి 75 రోజులు దాటినా ఇప్పటికీ బయ్యర్లు తనకు వసూళ్ల వివరాలను అందించడం లేదని సురేష్‌ కామాక్షి వాపోయారు.

మానాడు వంటి సక్సెస్ ఫుల్ సినిమా చిత్రానికే ఇలాంటి పరిస్థితా అని ప్రశ్నిస్తూ నిర్మాత సురేష్ ఈ మేరకు ఓ ట్వీట్ చేసారు. విజయవంతమైన సినిమాకే ఇలాంటి గతి పడితే.. ఇక ఈ వృత్తిని ఎలా నిర్వహించాలని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో నటులు, నిర్మాతలు ఓటీటీ వైపు దృష్టి సారించడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు సురేష్‌ కామాక్షి. ఇకపోతే నిర్మాత ఏర్పాటు చేసిన 'మానాడు' మూవీ సక్సెస్ మీట్ కు హీరో శింబు హాజరు కాకపోవడంపై ఆ మధ్య విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే 'మానాడు' సినిమాకు సంబంధించిన తెలుగు డబ్బింగ్ రైట్స్ తో పాటు.. అన్ని భాషల రీమేక్ రైట్స్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రవితేజ - నాగచైతన్య - రానా దగ్గుబాటి - అభిరామ్ వంటి హీరోల పేర్లు తెర మీదకు వచ్చాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.