Begin typing your search above and press return to search.

#మాల్దీవుల‌ ట్రీట్.. సాటి క‌థానాయిక‌ల‌కు శ్రుతి చీవాట్లు..!

By:  Tupaki Desk   |   6 May 2021 3:30 PM GMT
#మాల్దీవుల‌ ట్రీట్.. సాటి క‌థానాయిక‌ల‌కు శ్రుతి చీవాట్లు..!
X
క‌రోనా సెల‌వులు అంటూ ప్ర‌తి ఒక్క‌రూ మాల్దీవుల‌కు వెళ్లి ఫుల్ గా పార్టీల‌తో చెల‌రేగుతున్న ఫోటోలు వీడియోలు ఇటీవ‌ల అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇందులో ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భ‌ట్.. జాన్వీ క‌పూర్.. సారా అలీఖాన్ స‌హా ప‌లువురు టాప్ హీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నారు.

ఆ త‌ర్వాత మాల్దీవుల‌కు బ్యాన్ విధించాక వీళ్లంతా సైలెంట్ అయిపోయారు కానీ లేదంటే ఈ పాటికి ఒంట‌రి దీవిలో తుంట‌రి వేషాల‌తో అభిమానుల్ని టీజ్ చేయ‌డ‌మే ప‌నిగా జీవించేవారు. దీనిని నెటిజ‌నం ఒక రేంజులో తూర్పార‌బ‌ట్టారు. ఒక‌వేపు దేశంలో క‌రోనా చావుల‌తో కాష్టం కాలుతుంటే వీళ్లంతా ఇలా ఎంజాయ్ చేసి ఆ ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తారా? అంటూ చీవాట్లు పెట్టారు.

ఇక అందాల శ్రుతిహాస‌న్ కూడా నెటిజ‌నుల‌కు బాస‌టగా నిలుస్తూ తాను కూడా ఒంట‌రి దీవుల సెల‌బ్రేష‌న్ ని వ్య‌తిరేకించింది. అందుకు సంబంధించి ఇదివ‌ర‌కూ త‌న అభిప్రాయం తెలిపింది. ఇప్పుడు మ‌రోసారి శ్రుతిహాస‌న్ త‌న వ్యూని నిక్క‌చ్ఛిగా చెప్పేసింది. హాలీడే అంటూ మాల్దీవుల్లో విహ‌రించి ఆ ఫోటోల్ని సెల్ఫీల్ని షేర్ చేయ‌డం త‌గ‌దు అంటూ విరుచుకుప‌డిన శ్రుతి.. మాల్దీవుల బ్యాన్ స‌రైన‌దేన‌ని స‌మ‌ర్థించారు. తోటి తార‌లు వెళ్లాలా వ‌ద్దా నేను జ‌డ్జి చేయ‌ను క‌నీసం ఫోటోలు షేర్ చేయ‌డం స‌రికాద‌నేది నా అభిప్రాయం అని తెలిపారు. ఈ క‌ష్ట కాలంలో ఇలా చేయ‌డం స‌రికాదు. నేను కూడా ఫొటోలు పెడతాను. కానీ నేను మా ఇంట్లో ఐసొలేషన్ లో ఉంటూ ఆ సెల్ఫీలను షేర్ చేశాను. అంతేకానీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌లేదు.

ఇమేజ్ ఉన్న తార‌లు ఏం చేసినా అది ప్ర‌జ‌లు చూస్తారు. ఇలాంటి స‌మ‌యంలో ఇంట్లోనే ఉండాల‌ని మాస్క్ పెట్టుకోవాల‌ని సందేశం ఇవ్వాలి కానీ అలా ఊరిన ప‌డి తిరగ‌కూడ‌దు అని శ్రుతి అన్నారు.

ప్ర‌స్తుతం అంద‌రూ సామాజిక మాధ్య‌మాల్లో క‌రోనా పీడిత ప్ర‌జ‌ల‌కు త‌మ‌వంతు సాయం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది మంచి ప‌రిణామ‌మ‌ని శ్రుతి అన్నారు. కొంచెం త్వ‌ర‌గా అంద‌రికీ సాయ‌ప‌డ‌డం ప్రారంభించాల్సింది .. ఇప్పుడు దేవుని ప్రార్థించ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింద‌ని త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.