Begin typing your search above and press return to search.

ఎగ్జామ్స్ రాయాలంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   6 Jan 2016 1:30 AM GMT
ఎగ్జామ్స్ రాయాలంటున్న హీరోయిన్
X
చూడ్డానికి పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది మాళవిక నాయర్. కానీ ఆ అమ్మాయికి ఇప్పుడే 18 ఏళ్లు నిండాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తెలుగులో తన తొలి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’ మొదలుపెట్టే సమయానికి మాళవిక వయసు 16 ఏళ్లే. అంతకుముందు తమిళంలో ‘కుక్కు’ చేసేటపుడు 15 ఏళ్లు కూడా నిండలేదు. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా పూర్తయ్యాక మాళవికను పలకరించడానికి ఫోన్ చేస్తే పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి షాకిచ్చిందట ఈ కేరళ కుట్టి. ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో ‘కళ్యాణ వైభోగమే’ చేసిన మాళవిక.. సోమవారం ఈ చిత్ర యూనిట్ సభ్యుల మధ్య తన 18వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం విశేషం.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుతో నేను మేజరయ్యాను. ఇక నాకంటూ ఓ ఆలోచన విధానం, బలమైన సిద్ధాంతం ఏర్పరచుకునేలా ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం ఢిల్లీలో పన్నెండో తరగతి చదువుతున్నా. కెరీర్ - చదువు.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి’’ అని చెప్పింది మాళవిక. కొత్తగా ఇంకేం సినిమాలు ఒప్పుకున్నావ్ అని అడిగితే.. ‘‘ప్రస్తుతానికి ఏదీ ఒప్పుకోలేదు. ఏప్రిల్‌ వరకూ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటి కోసం సీరియస్ గా ప్రిపేరవుతున్నా. పరీక్షలు పూర్తయ్యాకే ఏదైనా సినిమా కమిట్ కాగలను. నందిని రెడ్డితోనే మరో సినిమా చేయాల్సి ఉంది. దాని గురించి కూడా ఎగ్జామ్స్ తర్వాతే ఆలోచిస్తా’’ అని చెప్పింది మాళవిక. తానెప్పుడూ కెరీర్ని ప్లాన్ చేసుకోలేదని.. హీరోయిన్ అవుతానని కూడా అస్సలు అనుకోలేదని.. అంతా అనుకోకుండానే జరిగిపోయిందని.. ఇకపైనా కెరీర్ విషయంలో తనకో ప్లాన్ అంటూ ఏమీ లేదని మాళవిక చెప్పింది.