Begin typing your search above and press return to search.

'మేజర్' రిలీజ్ డేట్ మళ్లీ మారింది..!

By:  Tupaki Desk   |   27 April 2022 6:30 AM GMT
మేజర్ రిలీజ్ డేట్ మళ్లీ మారింది..!
X
వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మేజర్''. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగానీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

''మేజర్'' అనేది అడివి శేష్ కు మొదటి పాన్ ఇండియా చిత్రం. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని పనులను నిశితంగా పర్యవేక్షిస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై సినిమా తీయాలని ప్లాన్ చేయడమే కాదు.. మేకింగ్‌ లోనూ ప్రతి విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నాడు.

శేష్ ఇందులో హీరోగా నటించడమే కాకుండా కథ - స్క్రీన్‌ ప్లే కూడా సమకూర్చారు. శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'మేజర్' మూవీ కోసం మేకర్స్ సరికొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. 2022 జూన్ 3న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఇంటెన్స్ గా చూస్తున్న శేష్ నుదిటిపై గాయాన్ని చూడొచ్చు. అలానే బ్యాగ్రౌండ్ లో ఉగ్రవాదుల దాడుల కారణంగా మంటల్లో కాలిపోతున్న తాజ్ హోటల్‌ ను మనం గమనించవచ్చు.

'మేజర్' సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. నిజానికి ఈ బయోపిక్ ని గతేడాది జూన్ లోనే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. కరోనా పాండమిక్ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అనేకసార్లు వాయిదా వేస్తూ వచ్చారు.

చివరగా మే 27న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు మరో వారం ముందుకు జరిపి, జూన్ 3న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సందీప్ బాల్యం, యుక్తవయస్సు మరియు సైన్యంలో అతని సేవల దగ్గర నుంచి.. ముంబై దాడి యొక్క విషాద సంఘటనల వరకు అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను 'మేజర్' సినిమా స్పృశిస్తుంది. ఇందులో అడివి శేష్ ప్రేయసిగా బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోభితా ధూళిపాళ్ళ - ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

'మేజర్' చిత్రానికి అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు రాయగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'హృదయమా' సంగీత ప్రియులను ఆకట్టుకుంది. అలానే చిత్ర టీజర్ దాని గ్రిప్పింగ్ కథనం మరియు అత్యున్నత సాంకేతికతలతో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. వంశీ పచ్చిపులుసు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.