Begin typing your search above and press return to search.

సందీప్ జీవితానికి ప్రతిబింబంగా శేష్ 'మేజర్'

By:  Tupaki Desk   |   15 March 2022 11:31 AM GMT
సందీప్ జీవితానికి ప్రతిబింబంగా శేష్ మేజర్
X
వర్సటైల్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ''మేజర్''. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందనే సంగతి తెలిసిందే.

'మేజర్' సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేయబడిన ప్రచార చిత్రాలు - గ్లిమ్స్ మరియు ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను అలరించాయి. నేడు (మార్చి 15) సందీప్ 45వ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ.. మేజర్ గొప్ప జీవితానికి ప్రతిబింబంగా మేకర్స్ ఓ టీజర్ ను విడుదల చేశారు.

'గుర్తుంచుకోవలసిన జీవితం.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన జీవితం' అని పేర్కొన్నారు. అడివి శేష్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. సందీప్ జీవితంలోని సంఘటనలను తెర మీద ఎలా ఆవిష్కరించారు.. మేజర్ గా శేష్ ఎలా ట్రాన్స్ఫార్మర్ అయ్యారనేది ఇందులో ఫోటోల రూపంలో చూపించారు. స్ప్లిట్ ఇమేజ్‌ లో సందీప్ మరియు శేష్‌ లలో పెద్దగా తేడాలు కనిపించకపోవడం విశేషం.

ఇందులో కేవలం మేజర్ జీవితంలోని వివిధ దశలను చూపడమే కాకుండా, ఆ పాత్రను అడివి శేష్‌ తో చిత్రీకరించిన మరపురాని సంఘటనలను కూడా చూపుతుంది. ఇది మేజర్‌ కి తన తల్లితో ఉన్న ఆప్యాయత.., సోదరితో అతని బంధం.. స్నేహితులతో అత్యుత్తమ క్షణాలు.. శిక్షణా రోజులు మరియు చివరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ లో అధికారిగా అతని అనుభవాలను వివరిస్తుంది.

''మేజర్ సినిమా సందీప్ ఉన్ని కృష్ణన్ గారి జీవితాన్ని బేస్ చేసుకొని తీసినది. ఒక గొప్ప సోల్జర్ లైఫ్ లో గుర్తులు.. జ్ఞాపకాలు ఈ సినిమాలో ఉన్నాయి. అమ్మతో అనుబంధం.. స్కూల్ ఫ్రెండ్స్ తో జ్ఞాపకాలు.. ఒక సోల్జర్ గా ఎక్సపీరియన్స్.. యానిమల్స్ అంటే ప్రాణం ఆయనకు.. అకాడమీలో ట్రైనింగ్.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ లో ఒక ఆఫీసర్.. ఒక గ్రేట్ లైఫ్.. ఒక గ్రేట్ మ్యాన్'' అని అడివి శేష్ చెప్పుకొచ్చారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ వీడియో ఒక సంపూర్ణ గుర్తింపుగా చెప్పవచ్చు. అంతేకాదు ఇది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ''మేజర్'' చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ బాల్యం - యుక్త వయస్సు - సైన్యంలో అందించిన సేవల నుండి మరణించిన ముంబై దాడి యొక్క విషాద సంఘటనల వరకు అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ సినిమా స్పృశిస్తుంది.

దీనికి హీరో అడవి శేష్ కథ - స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో అడివి శేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోభితా ధూళిపాళ్ళ - ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ బయోపిక్ ని నిర్మిస్తోంది. అబ్బూరి రవి సంభాషణలు రాయగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. 'మేజర్' చిత్రాన్ని సమ్మర్ సీజన్ లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలోకి తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ - మలయాళ భాషల్లో 2022 మే 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.