Begin typing your search above and press return to search.

యూఎస్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న 'మేజర్'

By:  Tupaki Desk   |   6 Jun 2022 7:02 AM GMT
యూఎస్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న మేజర్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ''మేజర్''. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఇటీవలే థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. తొలి రోజే ఆడియన్స్ నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ బయోపిక్.. విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు రాబట్టింది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తూ దూసుకుపోతోంది.

''మేజర్'' సినిమా మొదటి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 24.5 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఆదివారం నాడు మరిన్ని వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది. మొదటి వారాంతంలోనే సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా.. అప్పుడే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

యూఎస్ఏలో ప్రీమియర్స్ తోనే సంచనలం సృష్టించిన ''మేజర్'' మూవీ.. సండే వసూళ్లతో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ సినిమా ప్రీమియర్లతో 289 స్థానాల నుండి $269,526 కలెక్ట్ చేయగా.. వీకెండ్ పూర్తయ్యే సమయానికి $860K వసూళ్ళు రాబట్టి మిలియన్ మార్క్ దిశగా ముందుకు సాగుతోంది.

'మేజర్' హీరో అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా చెప్పవచ్చు. ఇంతకముందు 'ఎవరు' ($61K) యుఎస్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ఉండేది. నైజాంలో 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఈరోజుతో లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది.

ఆంధ్రాలో 'మేజర్' బ్రేక్ ఈవెన్ 6 కోట్లు ఉండగా.. రేపు మంగళవారం నాటికి ఆ మార్క్ అందుకునేలా కనిపిస్తోంది. సెడెడ్ లో 1.25 కోట్ల టార్గెట్ పెట్టుకోగా.. ఈరోజుతో బ్రేక్ ఈవెన్ అవుతుంది. కర్ణాటకలో ఈ విలువ 1.5 కోట్లు ఉండగా.. ఆదివారం రాత్రికి 1.2 - 1.4 కోట్ల వరకూ చేరుకుంది. హిందీలో ఫస్ట్ వీకెండ్ లో 4.66 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద 'మేజర్' సినిమా అన్ని పార్టీలకు లాభదాయకమైన వెంచర్ గా ముగుస్తోంది. ఒక కంటెంట్ ఆధారిత చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి. సాధారణంగా ఇలాంటి సినిమాలకు వినర్శకుల ప్రశంసలు - స్టాండింగ్ ఒవియేషన్స్ మరియు అవార్డులు రివార్డులు దక్కుతాయే తప్ప కలెక్షన్స్ మాత్రం ఆశించిన విధంగా ఉండవని అంటుంటారు. కానీ ఈ సినిమా వాటిని పటాపంచలు చేసింది.

అయితే మహేశ్ బాబు బ్రాండ్ వాల్యూ మరియు పాజిటివ్ మౌత్ టాక్ మరియు సానుకూల రివ్యూలు ఈ సినిమా ఇంత త్వరగా ''మేజర్'' మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ప్రధాన కారణంగా చెప్పాలి. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

మేజర్ పాత్రలో అడవి శేష్ నటించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. సందీప్ పాత్రలో ఒదిగిపోయారని సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు. 26/11 సంఘటనపై ఎన్నో సినిమాలు వచ్చినా ఈ బయోపిక్ కి ఆడియన్స్ చాలా స్పెషల్ గా కనెక్ట్ అయ్యారని అనుకోవచ్చు.

జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ - ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు కలిసి 'మేజర్' చిత్రాన్ని నిర్మించాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలో శోభిత ధూళిపాళ్ల - సయీ మంజ్రేకర్ - ప్రకాశ్ రాజ్ - రేవతి - మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.