Begin typing your search above and press return to search.

బోయ‌పాటి టీంకు 'క‌త్తి' వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   6 Jun 2019 6:34 AM GMT
బోయ‌పాటి టీంకు క‌త్తి వార్నింగ్‌!
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌లే కాదు.. హెచ్చ‌రిక‌లు చేయ‌టానికి వెనుకాడ‌ని ఫిలిం క్రిటిక్ పేరుతో సుప‌రిచితుడైన మ‌హేశ్ క‌త్తి ఆ మ‌ధ్య‌న ఎంత హాట్ టాపిక్కో తెలిసిందే. ఏ ఛాన‌ల్ చూసినా ద‌ర్శ‌నం ఇచ్చే ఆయ‌న‌.. కొద్ది రోజుల పాటు తెలుగు ఛాన‌ళ్ల‌లో పెద్ద ఎత్తున క‌నిపించేవారు. ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఆయ‌న ఫ్యాన్స్ మీద క‌త్తి చేసిన వ్యాఖ్య‌లు.. చేసిన సోష‌ల్ మీడియా పోస్టుల హ‌డావుడి అంతా ఇంతా కాదు.

కొంత‌కాలం చెల‌రేగిపోవ‌ట‌మే కాదు.. ప‌రిపూర్ణానంద స్వామితో మొద‌లైన ర‌చ్చ చివ‌ర‌కు క‌త్తిని న‌గ‌ర బ‌హిష్క‌రిస్తూ పోలీసులు పంపేయ‌టం.. ఆ త‌ర్వాత ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ చేరుకోవ‌టం తెలిసిందే. ఇటీవ‌ల కొంత‌కాలం వ‌ర‌కూ కామ్ గా ఉన్న ఆయ‌న‌.. తాజాగా సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నానికి తెర తీశారు.

ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి టీం మీద తీవ్ర ఆరోప‌ణ‌ల్ని సంధించారు. సోష‌ల్ మీడియాలో త‌న‌ను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఫేస్ బుక్ లో తాజాగా వ‌రుస పోస్టులు పెడుతున్న ఆయ‌న‌.. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి టీం లో కొందరు త‌న‌ను ట్రోల్ చేస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేశారు. ప‌నిలో ప‌నిగా టీడీపీ ప్ర‌స్తావ‌న కూడా తేవ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

కొంద‌రు త‌న‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకొని ట్రోల్ చేస్తున్నారని.. అలాంటి వారికి తానిచ్చే గ‌ట్టి వార్నింగ్ ఇదేనంటూ పోస్టులు పెట్టిన క‌త్తి.. ద‌ర్శ‌కుడు బోయ‌పాటికి చెందిన టీమ్ అని పేర్కొన‌టం చ‌ర్చ‌గా మారింది. ఇందులో తెలుగుదేశం పార్టీ పేరును తీసుకొచ్చారు. కొంద‌రు పెయిడ్ తెలుగుదేశం సోష‌ల్ మీడియా యోధులు ఓట‌మి త‌ర్వాత సైలెంట్ గా దుకాణం స‌ర్దేసుకున్నార‌ని.. మ‌రికొంద‌రు మాత్రం ఆ ట్రోలింగ్ చేయ‌టానికి అల‌వాటు ప‌డ్డ వీరులు మాత్రం అదే రీతిలో ట్రోల్స్ చేస్తున్నార‌న్నారు.

మ‌రికొంద‌రు కుల‌గ‌జ్జితో అదే బూతు పంథాలో కొన‌సాగుతున్నారంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీకి యాడ్స్ చేసిన బోయ‌పాటి టీంలో కొంద‌రు.. త‌మ విధేయ‌త‌ను ప్రూవ్ చేసుకోవ‌టానికో.. సంపాదించిన డ‌బ్బుకు రుణం తీర్చుకోవ‌టానికో లేక కువ‌లం కులగ‌జ్జితోనో అస‌భ్య ప‌ద‌జాలంతో ఆన్ లైన్ లో ట్రోలింగ్ కు పాల్ప‌డుతున్నార‌న్నారు.

అలాంటి వాంతా త‌మ దారి మార్చుకోవాల‌ని క‌త్తి హిత‌వు ప‌లికారు. మీరు దారి మార్చుకోమ‌ని కోరుతున్నా.. మార్చుకోకుండా సైబ‌రాబాద్ పోలీసులు మిమ్మ‌ల్ని మార్చ‌టానికి సిద్ధంగా ఉన్నారు జాగ్ర‌త్త అంటూ మ‌రో పోస్ట్ చేశారు. ఈ రోజు ఒక‌డు అరెస్ట్ అయ్యాడ‌ని.. మిగిలిన 47 మంది లిస్టు కూడా ఇంటెలిజెన్స్.. లా అండ్ ఆర్డ‌ర్.. సైబ‌ర్ క్రైమ్ శాఖ వ‌ద్ద‌కు చేరిన‌ట్లుగా పేర్కొన్నారు.

రాజ‌కీయ విమ‌ర్శ‌లు.. విధాన‌ప‌ర‌మైన విభేదాలు ఎక్క‌డైనా స్వాగ‌త‌మేన‌ని.. వ్య‌క్తిత్వ హ‌న‌నం.. బూతులు.. చావులు కోరుకోవ‌టాలు.. చంపుతామ‌ని.. హాని చేస్తామ‌ని బెదిరించ‌టాలు చేస్తే వార్నింగ్ కూడా లేకుండా డైరెక్ట్ శ్రీ‌కృష్ణ జ‌న్మ‌స్థాన‌మే జాగ్ర‌త్త అంటూ హాట్ వార్నింగ్ ఇచ్చేశారు. గ‌తానికి కాస్త భిన్నంగా ఏక‌కాలంలో సినిమా.. రాజ‌కీయాల్ని క‌ల‌గ‌లిపిన పోస్టుల‌తో వార్త‌ల్లోకి వ‌చ్చేశారు క‌త్తి మ‌హేశ్‌.