Begin typing your search above and press return to search.

చాలాకాలం తరువాత మహేశ్ జోడీగా కెమెరా ముందుకు వచ్చిన నమ్రత!

By:  Tupaki Desk   |   1 Oct 2021 6:38 AM GMT
చాలాకాలం తరువాత మహేశ్ జోడీగా కెమెరా ముందుకు వచ్చిన నమ్రత!
X
మహేశ్ బాబు - నమ్రత ఇద్దరూ కూడా అన్యోన్య దాంపత్యానికి ఆనవాలుగా కనిపిస్తారు. తమ ఫ్యామిలీ .. తమ సరదాలు .. సందళ్లు తప్ప, అనవసరమైన విషయాలను గురించి ఇద్దరూ పట్టించుకోరు. 'వంశీ' సినిమా సమయంలో ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత నమ్రత ఇక సినిమాల వైపుకు రాలేదు. మహేశ్ సినిమాలు .. యాడ్స్ .. అందుకు సంబంధించిన ప్లానింగ్ లో ఆమె ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటారు. అలాగే ఆయన చేసే సామాజిక కార్యక్రమాలు అన్నీ కూడా నమ్రత చేతుల మీదుగానే జరుగుతూ ఉంటాయి.

నమ్రత బాగా తెలివైనవారనీ .. మహేశ్ సినిమా వ్యవహారాలను ఆమెనే చక్కబెడతారనే విషయం అందరికీ తెలిసిందే. ముందుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్న తరువాత సాధ్యమైనంత వరకూ అది మారకూడదనే మహేశ్ అభిప్రాయానికి తగినట్టుగానే ఆమె ప్లాన్ చేస్తూ ఉంటారు. మహేశ్ తన సినిమాల ఓపెనింగ్ కి రారు .. ఆయనకి అదో సెంటిమెంట్. అందువలన నమ్రత మాత్రమే హాజరవుతూ ఉంటారు. ఇక ఆ తరువాత ఆయన సినిమాలు ఎలాంటి రికార్డులను సృష్టించినా వాటిని గురించి ఆమె ఎక్కడా ప్రస్తావించరు .. ఎలాంటి పోస్టులు పెట్టరు.

ఒక వైపున మహేశ్ సినిమాలు .. యాడ్స్ .. సామాజిక సేవకి సంబంధించిన విషయాలతో పాటు, మరో వైపున పిల్లలకి సంబంధించిన పూర్తి పనులను ఆమెనే చక్కబెడుతూ ఉంటారు. మహేశ్ బాబుకు మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా అలవాటు తక్కువ. అందువలన ఆ లోటును నమ్రత భర్తీ చేస్తుంటారు. తమ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను .. వీడియోలను ఆమె పోస్ట్ చేస్తుంటారు. అలా మహేశ్ బాబును అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంచుతుంటారు. సితార ఆటపాటలు కూడా పోస్ట్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు.

మహేశ్ బాబు షూటింగు లొకేషన్స్ కి ఆమె వెళ్లడం చాలా తక్కువ. అలాంటి ఆమె తాజాగా మహేశ్ బాబుతో కలిసి ఒక ఫొటో షూట్ లో పాల్గొనడం విశేషం. ఒక మ్యాగజైన్ ఫొటో షూట్ కోసం చాలా కాలం తరువాత ఇద్దరూ కలిసి కెమెరా ముందుకు వచ్చారు. ఇద్దరూ కూడా చాలా స్టైలీష్ గా కనిపిస్తూ అదరగొట్టేశారు. ఇప్పుడు ఈ మేగజైన్ పోస్టర్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. దీన్ని ఒక మ్యాగజైన్ కోసం దిగిన ఫొటోగా మాత్రమే చూడలేము. మహేశ్ దంపతులకు .. ఆయన అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అందమైన జ్ఞాపకమని చెప్పచ్చు.

ప్రస్తుతం మహేశ్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. 'సంక్రాంతి' కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఒక భారీ స్కామ్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. యాక్షన్ తో పాటు కామెడీ పాళ్లు పుష్కలంగా ఉన్న కథ ఇది. మహేశ్ బాబు మరింత యంగ్ లుక్ తో కనిపిస్తుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్న విషయం, ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగు పూర్తికాగానే మహేశ్ బాబు, త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో 'అతడు' .. 'ఖలేజా' వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా కోసం సెట్స్ పైకి వెళ్ళడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా రాజకీయాలను టచ్ చేస్తూ సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. ఇంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' చేసిన ఆమె, మహేశ్ జోడీగా 'మహర్షి'లో మెరిసిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత రాజమౌళితో మహేశ్ ప్రాజెక్టు మొదలుకానుంది.