Begin typing your search above and press return to search.

పూనకాల ఎపిసోడ్ లోడింగ్.. ఒకే ఫ్రేమ్ లో మహేష్ - ఎన్టీఆర్..!

By:  Tupaki Desk   |   20 Nov 2021 7:30 AM GMT
పూనకాల ఎపిసోడ్ లోడింగ్.. ఒకే ఫ్రేమ్ లో మహేష్ - ఎన్టీఆర్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువున్నా బాగా కలిసిపోయారు. ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తారు. మహేష్ ను ప్రేమగా అన్నయ్య అని పిలుస్తుంటారు తారక్. మహేష్ కూడా ఎన్టీఆర్ పట్ల అదే ప్రేమను కురిపిస్తుంటారు. ఎవరి సినిమా విడుదలైనా ఫోన్ చేసి మరీ ఒకరికొకరు అభినందించుకుంటూ ఉంటారు. సినిమా ఫంక్షన్స్ కు హాజరవడమే కాకుండా.. ఇద్దరి కుటుంబాలు కలసి పార్టీలు కూడా చేసుకుంటారు. అయితే చాలా రోజుల తర్వాత మహేష్ - ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు.

'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే క్విజ్ షో కు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీ గెస్టుగా మహేష్ బాబు హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. దీనికి సంబంధించిన ఫోటోలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ షో ప్రసారం అవుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

EMK షో లో మహేష్ - తారక్ పాల్గొన్న ఓ పోస్టర్ ను జెమినీ టీవీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎపిసోడ్ ఆఫ్ ది డికేడ్ చూడటానికి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ.. దీనికి పూనకాలు లోడింగ్ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ హోస్ట్ గా సూటు బూటు ధరించి ఉండగా.. మహేష్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో స్టైలిష్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలలైన మహేష్ బాబు - ఎన్టీఆర్ లతో రూపొందిన EMK ఎపిసోడ్ బుల్లితెర మీద అత్యధిక టీఆర్పీ రేటింగ్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక ఈ షో లో మహేష్ 25 లక్షలు గెలుపొందారని సమాచారం. జనరల్ నాలెడ్జ్ - కరెంట్ అఫైర్స్ మీద మహేష్ చాలా పరిణితి చెందినవాడనే సంగతి తెలిసిందే. పుస్తకాలు చదవడమే కాదు.. దేశవిదేశాలను చుట్టేస్తూ ఉంటారు.

ఇప్పుడు తారక్ అడిగిన ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానమిచ్చి సూపర్ స్టార్ పాతిక లక్షలు గెలుచుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆ మొత్తాన్ని మహేష్ ఓ ఛారిటీకి డొనేట్ చేశారని సమాచారం. ఏదేమైనా మహేష్ బాబు- ఎన్టీఆర్ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ కోసం సినీ అభిమానులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.