Begin typing your search above and press return to search.

ఈ రికార్డు పవన్.. మహేశ్ లకు మాత్రమే సాధ్యం

By:  Tupaki Desk   |   29 July 2022 4:27 AM GMT
ఈ రికార్డు పవన్.. మహేశ్ లకు మాత్రమే సాధ్యం
X
సినిమా ఏదైనా సరే.. పాన్ ఇండియాగా మార్చేయటం ఒక అలవాటుగా మారింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఒక మోస్తరు సినిమాను నాలుగైదు భాషల్లోకి మార్చేయటం.. పెద్ద ఎత్తున ప్రచారాంశాలతో దానికి హైప్ తీసుకురావటం తెలిసిందే.

అందుకు భిన్నంగా తెలుగు భాషలో మాత్రమే విడుదలై అదిరే కలెక్షన్లతో భారీగా వసూళ్లు సాధించే సత్తా ఉన్న టాలీవుడ్ హీరోలు ఇద్దరే ఇద్దరని చెబుతున్నారు. వారే పవర్ స్టార్ పవన్ కల్యాణ్... సూపర్ స్టార్ మహేశ్ బాబు. వారిద్దరూ నటించిన సినిమాలు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా ఉండటం విశేషం.

దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ ఇద్దరు హీరోల సినిమాలు పాన్ ఇండియా చిత్రాల వసూళ్లకు ధీటుగా నిలవటం విశేషం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో మహేశ్ బాబు సర్కారు వారి పాట రూ.155 కోట్ల వసూళ్లను రాబడితే.. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సైతం రూ.132 కోట్ల వసూళ్లు సాధించింది.

వాస్తవానికి పవన్ భీమ్లా నాయక్ విడుదలయ్యే నాటికి ఏపీలోని థియేటర్లలో టికెట్ల ధరలు కారుచౌకగా ఉండటం.. పవన్ మీద ఉన్న రాజకీయ వైరంతోనే అలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

అలాంటి పరిస్థితుల్లో కూడా రూ.132 కోట్ల వసూళ్లు సాధించటం చూస్తే.. బాక్సాఫీస్ లో పవన్ స్టామినా ఏమిటో అర్థమవుతుందని చెబుతారు. ఈ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు తెలుగులో మాత్రమే విడుదలై ఇంత భారీ వసూళ్లను సాధిస్తే.. జాబితాలో నిలిచిన మిగిలిన సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలు కావటం గమనార్హం. అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల్లో (ఈ ఏడాదిలో ఇప్పటివరకు) సర్కారు వారి పాట ఎనిమిదో స్థానంలో నిలిస్తే.. భీమ్లా నాయక్ పదో స్థానంలో నిలిచింది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పవన్.. మహేశ్ లు ఇద్దరూ పాన్ ఇండియా సినిమా చేయనప్పటికీ.. తెలుగులో మాత్రమే విడుదలై ఇంత భారీగా వసూళ్లు చేయటం వారికి మాత్రమే సాధ్యమంటున్నారు. ఇలాంటి రికార్డు టాలీవుడ్ లో మరే హీరోకు లేదని.. ఈ ఇద్దరికే సొంతమని చెబుతున్నారు.