Begin typing your search above and press return to search.

దసరా బరిలో శర్వా - సిద్ధార్థ్ 'మహాసముద్రం'

By:  Tupaki Desk   |   27 Aug 2021 6:30 AM GMT
దసరా బరిలో శర్వా - సిద్ధార్థ్ మహాసముద్రం
X
యంగ్ హీరో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''మహాసముద్రం''. ఇందులో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'Rx 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

''మహా సముద్రం'' చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో శర్వానంద్ - సిద్ధార్థ్ ఇద్దరూ ఒకరికొకరు తుపాకులు గురిపెట్టుకొని ఉండగా.. హీరోయిన్ అదితి రావు హైదరి సముద్రంలో సరదాగా గడుపుతూ ఉంది. శర్వా - సిద్ధు ఇద్దరూ భయంకరమైన అవతారాలలో కనిపిస్తుండగా.. అదితి అందంగా కనిపిస్తోంది.

'మహాసముద్రం' చిత్రాన్ని ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - 'హే రంభా' సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ట్రేడ్ సర్కిల్స్ లో బజ్ క్రియేట్ అవడంతో మేకర్స్ మంచి డీల్స్ పొందుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్ రూ. 10.5 కోట్లకు తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే శర్వానంద్ - సిద్దార్థ్ కెరీర్‌ లో ఇది అతిపెద్ద డిజిటల్ డీల్ అని చెప్పవచ్చు.

AK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోటా సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు - రావు రమేష్ - గరుడ రామ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మహాసముద్రం' చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.