Begin typing your search above and press return to search.

రానా హీరోగా 'మన్నాడు' రీమేక్?

By:  Tupaki Desk   |   5 Jan 2022 7:30 AM GMT
రానా హీరోగా మన్నాడు రీమేక్?
X
తమిళంలో శింబు కథానాయకుడిగా 'మన్నాడు' తెరకెక్కింది. ఎస్.ఎస్.ఐ. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. తమిళంలో క్రితం ఏడాది నవంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్ డ్రామాను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. 'మన్నాడు' అంటే 'మహాసభ' అని అర్థం. తెలుగులో ఈ సినిమాకి 'ది లూప్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. పబ్లిసిటీ కూడా భారీస్థాయిలోనే ప్లాన్ చేశారు.

ఇటీవల కాలంలో తమిళ హీరోలంతా టాలీవుడ్ లో తమ క్రేజ్ ను .. మార్కెట్ ను పెంచుకోవడానికి తహ తహలాడుతున్నారు. తమ సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ చేయడానికి పోటీపడుతున్నారు. దాంతో తమిళంలో తన కెరియర్ ను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న శింబు కూడా, తెలుగులో ఈ సినిమా భారీస్థాయిలో విడుదలయ్యేలా చూడటానికి గట్టిగానే ప్రయత్నాలు చేశాడుగానీ కుదరలేదు. కొన్ని కారణాల వలన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయలేకపోయారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను గీతా ఆర్ట్స్ వారు తీసుకున్నారనీ, అల్లు శిరీష్ హీరోగా రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నారు. కానీ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు సురేశ్ ప్రొడక్షన్స్ చేతిలో ఉన్నట్టుగా స్పష్టమైంది. 'మన్నాడు' కథకి చాలా దగ్గర పోలికలు ఉన్న ఒక కథను ఒక సంస్థవారు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సురేశ్ ప్రొడక్షన్స్ వారి దృష్టికి వచ్చిందట. దాంతో ఈ సినిమాలోని ఏ ఒక్క అంశాన్ని ఎవరు కాపీ కొట్టినట్టు తెలిసినా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారికంగా ప్రకటించారు.

నిజానికి 'మన్నాడు' కథాకథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. 'వల్లభ' తరువాత తెలుగులో పెద్దగా హిట్ చూడని శింబుకి ఈ సినిమా హిట్ తెచ్చిపెట్టడం ఖాయమని చాలామంది చెప్పుకున్నారు. ఎస్.జె. సూర్య విలనిజం ఈ సినిమాకి హైలైట్. శింబూ పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుంది. ఆయన పాత్రలోని వేరియేషన్స్ ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. ఈ కథ రానా కి సెట్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నవారి సంఖ్య ఎక్కువ. మరి సురేశ్ బాబు ఆలోచన ఏమిటనేది చూడాలి. త్వరలోనే తెలుగు రీమేక్ కి సంబంధించిన సమాచారం బయటికి వచ్చే అవకాశమైతే ఉంది.