Begin typing your search above and press return to search.

నేను పెట్టాల్సిన మీటింగ్‌ ఎవరో పెడితే నేను ఎలా వెళ్తాను!

By:  Tupaki Desk   |   22 Oct 2019 5:28 AM GMT
నేను పెట్టాల్సిన మీటింగ్‌ ఎవరో పెడితే నేను ఎలా వెళ్తాను!
X
ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ సభ్యుల ఫ్రెండ్లీ మీటింగ్‌ పై వివాదం కొనసాగుతోంది. మా అధ్యక్షుడు లేకుండా మీటింగ్‌ ఎలా నిర్వహిస్తారంటూ కొందరు.. ఇది ఫ్రెండ్లీ మీటింగ్‌ కనుక మా అధ్యక్షుడి అవసరం ఏముందని మరి కొందరు వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో మా అధ్యక్షుడు నరేష్‌ స్పందించారు. మీడియాకు ఆయన ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఆ వీడియో సందేశంలో నరేష్‌ విషయమై తన వివరణ ఇవ్వడం జరిగింది.

నరేష్‌ మాట్లాడుతూ.. ఆదివారం జరిగిన మీటింగ్‌ కు మీరు ఎందుకు హారు కాలేదు అంటూ చాలా మంది నన్ను అడుగుతున్నారు. వారి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలా మీ ముందుకు వచ్చాను. 25 రోజుల క్రితం మా ఎమర్జెనీ జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించబోతున్నాం.. హాజరు అవ్వాలంటూ నాకు ఆహ్వానం వచ్చింది. మొన్న షూటింగ్‌ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్లీ మీటింగ్‌ నిర్వహిస్తున్నాం రావాలంటూ ఒక లెటర్‌ వచ్చింది.

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ రూల్‌ ప్రకారం సంవత్సరానికి ఒక సారి చొప్పున రెండు సంవత్సరాలకు రెండు సార్లు జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. కొత్త సభ్యులు ఎన్నికైన తర్వాత ఆ మీటింగ్‌ నిర్వహించాం.. సక్సెస్‌ ఫుల్‌ గా అందులో అనుకున్న పనులు చేస్తున్నాం. అలాంటప్పుడు ఎమర్జెన్సీ జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టాల్సిన అవసరం ఏంటీ అనిపించింది.

నేను జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టి అందరిని ఆహ్వానించాలి.. ఎవరో జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టి ఆహ్వానిస్తే నేను ఎలా వెళ్తాను. కొందరు పెద్దలు నన్ను వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మీ మీటింగ్‌కు వెళ్తే ఏదైనా సంఘటన జరిగితే అధ్యక్షుడిగా నేను బాధ్యత వహించాల్సి ఉంటుందని నేను వెళ్లలేదు. నేను మీటింగ్‌ జరగకుండా అడ్డుకుంటున్నాను అని కొందరు ప్రచారం చేశారు. ఆ మీటింగ్‌ జరుగకుండా అడ్డుకోవాల్సిన అవసరం నాకేంటి. అసలు అది ఏ సమావేశమో తెలియకుండా నేను అక్కడకు వెళ్లి చేయాల్సింది ఏముంది. ఫ్రెండ్లీ సమావేశం అంటూ చెప్పి ప్లెక్సీలో సర్వసభ్య సమావేశం అంటూ ఉంది.

ఫ్రెండ్లీ సమావేశంకు హాజరు అయిన ఒక లాయర్‌ 'మా' రాజ్యాంగం గురించి కామెంట్స్‌ చేశాడు. మా రాజ్యాంగంలో చాలా పనికి రాని పాయింట్లు ఉన్నాయి వాటిని తొలగించడం లేదంటే సవరించడం చేయాలని చెప్పడం చాలా బాధగా అనిపించింది. పాతిక సంవత్సరాలుగా ఆ రాజ్యాంగంతోనే ప్రముఖులు పలువురు మా పాలన కొనసాగించారు. సినిమా పరిశ్రమ పెద్దలు చిరంజీవి.. కృష్ణ.. నాగేశ్వరరావు.. నాగార్జున ఇలా ఎంతో మంది ప్రముఖుల ఆధ్వర్యంలో తయారైన రాజ్యాంగంను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మార్చేసుకోవచ్చా.

గౌరవ అధ్యక్షులుగా ఉన్న వారిని.. ముఖ్య సలహాదారుగా ఉన్న వారిని ఎవరిని సంప్రదించకుండా రాజ్యాంగాన్ని మార్చేయాలని ఎలా నిర్ణయం తీసుకుంటారని నరేష్‌ ప్రశ్నించాడు. ప్రస్తుత రాజ్యాంగంను తీసి పారేయడం అంటే మా సంస్థకు డ్యామేజ్‌ చేయడమే అంటూ నరేష్‌ అభిప్రాయ పడ్డాడు. త్వరలో మళ్లీ ఎక్స్‌ ట్రార్డినరీ జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టాలని అనుకోవడంను కూడా నరేష్‌ తప్పుబట్టాడు.

కొత్త మా కార్యవర్గం ఏర్పాటు అయిన తర్వాత పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రెండు కోట్లతో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి నెల పించను ఇవ్వడంతో పాటు చనిపోయిన కళాకారులకు వెంటనే ఇన్సురెన్స్‌ ఇప్పిస్తున్నామంటూ నరేష్‌ పేర్కొన్నారు. అంతా బాగానే ఉన్నా కొందరు కావాలని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విధంగా నరేష్‌ మాట్లాడారు.