Begin typing your search above and press return to search.

‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్

By:  Tupaki Desk   |   3 Sep 2021 6:30 AM GMT
‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (మా) రసవత్తరంగా మారుతున్నాయి. సాధారణ ఎన్నికలను తలపిస్తోన్న ఈ ఎన్నికలు రోజురోజుకీ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంకా ఎన్నికల తేదీ ప్రకటించకముందే అప్పుడే విందు రాజకీయాలు మొదలయ్యాయి. మొన్నటివరకు మాటలకే పరిమితమైన రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది.

తాజాగా ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ విందు రాజకీయాలకు తెరతీశారు. ప్రస్తుతం ఆయన పేరుతో ఓ ఆహ్వాన సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేస్తున్న పార్టీకి తప్పకుండా రావాలంటూ ఓ మెసేజ్ ను గురువారం పలువురు నటీనటుల వాట్సాప్ గ్రూపులో సర్క్యూలేట్ అవుతోంది. హైదరాబాద్ లోని దశ్ పల్లా ఫోరమ్ హాల్ లో ఏర్పాటు చేయనున్న ఈ విందు కార్యక్రమానికి ఆహ్వానం శుక్రవారం వస్తుందని సదురుసందేశంలో పేర్కొన్నారు.

ఈ మెసేజ్ ప్రస్తుతం డాక్టర్ నరేశ్ విజయ్ కృష్ణ పేరుతో వైరల్ అవుతోంది. ఈక్రమంలోనే ఈ సందేశం ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులకు తప్ప మిగతా సభ్యులందరికీ ఫార్వర్డ్ చేస్తుండడం గమనార్హం.

ప్రస్తుతం నరేశ్ వర్గం.. మంచు విష్ణుకు మద్దతు ఇస్తోన్న సంగతి తెలిసింద. కాగా ఈ విందు రాజకీయానికి మొదట ప్రకాష్ రాజ్ ప్యానెల్ తెరతీసిందని చెప్పాలి. ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఉందంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుడు సమీర్ ఆహ్వానం పంపారు. దీంతో మొదట ప్రకాష్ రాజ్ పార్టీ ఆన్ చేయగా.. ఇప్పుడు నరేశ్ వర్గం ఈ పార్టీని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ మా ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.