Begin typing your search above and press return to search.

'మా'లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేదు:త‌మ్మారెడ్డి!

By:  Tupaki Desk   |   15 Sep 2018 11:58 AM GMT
మాలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేదు:త‌మ్మారెడ్డి!
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా)లో మొద‌లైన వివాదం చినికి చినికి గాలివాన‌లా మారిన సంగ‌తి తెలిసిందే. `మా` నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల నిధులు దుర్వినియోగమ‌య్యాయంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌లు టాలీవుడ్ లో పెను దుమారం రేపాయి. నిధులు దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే - తన ఆస్తి మొత్తాన్నీ ఇండ‌స్ట్రీకి రాసిచ్చేస్తానని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా సవాల్ విసిరారు. అయితే, నిధులు దుర్వినియోగం అయిన‌ట్లు అనుమానాలున్నాయ‌ని, దానిపై ఓ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని `మా` కార్యదర్శి - సీనియర్ నటుడు నరేశ్ డిమాండ్ చేశారు. వీరిద్ద‌రూ విడివిడిగా మీడియా ముందుకు వ‌చ్చి...ఆరోప‌ణ‌లు చేసుకున్న‌ క్ర‌మంలో ఈ వ్య‌వ‌హారం ముదిరి పాకాన ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఆ వివాదాన్ని స‌ద్దుమ‌ణిగించే దిశ‌గా ఆ వివాదంపై వివరణ ఇచ్చేందుకు శనివారంనాడు `మా` ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే, ఆ స‌మావేశంలో సీనియ‌ర్ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డికి - మీడియా వారికి వాగ్వాదం జ‌రిగింది. తాము నరేష్ - శివాజీరాజాల‌తో మాట్లాడ‌తామ‌ని మీడియా స‌భ్యులు ప‌ట్టుబ‌ట్ట‌డంతో కొంత గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. చివ‌రికి నిర్మాత సురేష్ బాబు క‌లుగ‌జేసుకోవ‌డంతో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది.

న‌రేష్ -శివాజీ రాజాల మ‌ధ్య ఏర్ప‌డిన వివాదంపై క్లార‌టీ ఇచ్చేందుకు త‌మ్మారెడ్డి - సురేష్ బాబు - కేఎల్ నారాయణ - తమ్మారెడ్డి భరద్వాజ - శివాజీ రాజా - నరేష్ లు ఓ మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.`మా`లో ఎలాంటి అవకతవకలు జర‌గ‌లేద‌ని - అన‌వ‌స‌ర విషయాలపై మీడియాలో చ‌ర్చ జ‌ర‌గ‌డం వ‌ల్లే ఈ వివ‌ర‌ణ ఇస్తున్నామ‌ని త‌మ్మారెడ్డి అన్నారు. గతంలో జరిగిన విషయాలను తవ్వుకోవాల్సిన అవసరం లేదని ఆయ‌న అన్నారు. భవిష్యత్ లో ఇండ‌స్ట్రీలో ఏవైనా అంత‌ర్గ‌త‌ సమస్యలు వ‌స్తే వాటిని ప‌రిష్క‌రించేందుకు `కలెక్టివ్ కమిటీ`ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ విష‌యం మీడియాకు తెలియ‌జేసేందుకే స‌మావేశం ఏర్పాటు చేశామ‌ని, ఇండస్ట్రీ తరఫున మాట్లాడానికి తాను వచ్చాన‌ని అన్నారు.

అయితే, ఆరోప‌ణ‌లు చేసుకున్న శివాజీ రాజా - నరేష్ లు ఎలా కలిసి పనిచేస్తార‌ని త‌మ్మారెడ్డిని మీడియా ప్ర‌శ్నించింది. అయితే, ఆ ఆరోప‌ణ‌లు గ‌త‌మ‌ని - ఇపుడు వారు క‌లిసి ప్రెస్ మీట్ కు వ‌చ్చార‌ని.....అలా కాద‌ని ఇప్పుడు వాళ్లను కొట్టుకోమని అంటారా అని తమ్మారెడ్డి ఘాటుగా స్పందించారు. అయితే, త‌మ్మారెడ్డి స‌మాధానంతో సంతృప్తి చెంద‌ని మీడియా సభ్యులు...నరేష్ - శివాజీరాజా ఆరోపణలపై వారితో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, దానికి త‌మ్మారెడ్డి నిరాకరించ‌డంతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌మ్మారెడ్డి తీరు మీడియాను పిలిచి అవమానించే విధంగా ఉంద‌ని వారు అన్నారు. ఈ క్ర‌మంలో సమావేశంలో కొద్దిగా గందరగోళం ఏర్ప‌డింది. ఈ స‌మ‌యంలో క‌ల్పించుకున్న సురేష్ బాబు...మీడియా స‌భ్యుల‌కు వివ‌ర‌ణ ఇచ్చి శాంతింప‌జేశారు.