Begin typing your search above and press return to search.

హిట్ కొట్టేసిన 'లవ్ స్టోరీ' .. మరోసారి సెట్ అయిన కాంబినేషన్!

By:  Tupaki Desk   |   29 Sep 2021 1:30 AM GMT
హిట్ కొట్టేసిన లవ్ స్టోరీ .. మరోసారి సెట్ అయిన కాంబినేషన్!
X
తెలుగు తెరపై ప్రేమకథలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. విభిన్నమైన కథాకథనాలు .. మనసుకు హత్తుకు పోయే మాటలు .. హృదయపు లోతులు తాకే పాటలు ఉంటే, ఇక ఆ సినిమాకి ప్రేక్షకులు పట్టం కట్టేస్తారు. వీలైనంతవరకూ విజయాన్ని తీసుకొచ్చి దోసిట్లో పెట్టేస్తారు. ప్రస్తుతం అలాంటి ఆదరాభిమానాలను దక్కించుకుంటున్న సినిమాగా 'లవ్ స్టోరీ' సినిమా కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది.

ప్రేమకథలపై శేఖర్ కమ్ములకు మంచి పట్టుంది. ప్రేమకథలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎలా థియేటర్లకు రప్పించాలో కూడా ఆయనకి బాగా తెలుసు. నిజానికి ఎవరైనా సరే యూత్ ను దృష్టిలో పెట్టుకునే లవ్ స్టోరీస్ తీస్తారు .. ఎందుకంటే యూత్ కోరుకునేవి .. ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించేవి ఒకే తెరపై ఇమడవు. కానీ ఒకే కథతో అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఒప్పించడం ఒక్క శేఖర్ కమ్ములకు మాత్రమే సాధ్యమైంది. ఇక కథను స్థానికంగా నడిపిస్తూ .. అక్కడి యాసలో పాత్రల చేత మాట్లాడిస్తూ మాస్ ఆడియన్స్ కూడా ఇది మనకథ అనుకునేలా చేయడం ఆయన ప్రత్యేకత.

ఇలాంటి లక్షణాలతో .. అంశాలతో తెరకెక్కిన 'లవ్ స్టోరీ'కి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. భారీ వసూళ్లను థియేటర్లకు బహుమానంగా అప్పగిస్తున్నారు. దాంతో ఈ సినిమా టీమ్ అంతా కూడా ఫుల్ ఖుషీగా ఉంది. అంతేకాదు ఇదే కాంబినేషన్లో మరో సినిమాను చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చేశారు. చైతూ .. సాయిపల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నామని నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు చెప్పారు. వచ్చే ఏడాదిలో ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు.

ప్రస్తుతం చైతూ .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్నాడు. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇక ఇటీవలే 'బంగార్రాజు' సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో ఒక కథానాయకుడిగా నాగార్జున కనిపించనుండగా, మరో కథానాయకుడిగా చైతూ కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో రొమాన్స్ పాళ్లు ఎక్కువగానే ఉండనున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన జోడీగా కృతి శెట్టి అలరించనుంది.

ఈ రెండు సినిమాలను చైతూ పూర్తి చేయవలసి ఉంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వారి వెబ్ సిరీస్ ను కూడా పూర్తి చేయవలసి ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ వచ్చే సమ్మర్ కి పూర్తవుతాయి. ఇక ఈ లోగా శేఖర్ కమ్ముల కూడా ధనుశ్ సినిమాను మొదలుపెట్టేసి .. పూర్తి చేయవలసి ఉంది. ధనుశ్ కథానాయకుడిగా ఆయన ఒక సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

అంటే 'లవ్ స్టోరీ'తో కలుపుకుని దర్శక నిర్మాతలు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక సాయిపల్లవి విషయానికి వస్తే, ఆమె నుంచి 'విరాటపర్వం' .. 'శ్యామ్ సింగరాయ్' సినిమాలు రానున్నాయి. ఈ రెండు సినిమాల్లోను ఆమె చేసిన పాత్రలు విభిన్నమైనవి .. విశిష్టమైనవి కావడం విశేషం. ఒక మలయాళం సినిమాకి సైన్ చేశాననీ, రెండు తెలుగు .. రెండు తమిళ కథలు చర్చల దశలో ఉన్నాయని రీ సెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పింది. ఆ ప్రాజెక్టుల విషయం చూసుకుని ఆమె వచ్చే వేసవికి రెడీ అవుతుందన్న మాట.