Begin typing your search above and press return to search.

సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యంపై వదంతులు..నిజమెంత?

By:  Tupaki Desk   |   22 May 2020 7:00 AM GMT
సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యంపై వదంతులు..నిజమెంత?
X
టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సీరియస్ గా ఉన్నాడన్న వార్త కలకలం రేపింది. నల్గొండ జిల్లాకు చెందిన సుద్దాల టాలీవుడ్ లో గొప్ప గేయ రచయితగా పేరు సంపాదించుకున్నాడు. 1200 సినిమాలకు పనిచేశారు. ఏకంగా 2వేల పాటలు రాశారు. ఠాగూర్ లో ‘నేను సైతం’ పాటకు జాతీయ ఉత్తమ గేయరచయిత అవార్డు కూడా దక్కింది. ఇంతటి పేరు ప్రఖ్యాతలు గల రచయిత ఆరోగ్య పరిస్థితి చెడిందనగానే టాలీవుడ్ లో అందరూ ఆరాతీయడం మొదలుపెట్టారు.

గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆరోగ్య పరిస్థితి విషమించిందని టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతోంది. ఆయన లివర్ ఖరాబైందని.. గచ్చిబౌలిలోని గ్యాస్ట్రో ఎంటరాలజీలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేస్తున్నారని.. ఆయనకు బి-నెగెటివ్ బ్లడ్ అత్యవసరం అంటూ వార్త వైరల్ అయ్యింది.

దీంతో ఖంగారు పడిన అందరూ ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. ఈ మేరకు సుద్దాలనే తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వార్తలు అబద్దమని క్లారిటీ ఇచ్చారు. కాస్త నలతగా ఉంటే ఆస్పత్రిలో చేరానని.. లివర్ బాగానే ఉందని.. రక్తం అవసరమన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన కుటుంబం కూడా ఖంగారు పడాల్సినంత ఏమీ లేదని వివరణ ఇచ్చింది.

తనకు సీరియస్ గా ఉందని ఫోన్ చేస్తున్నారని.. ఇలా వార్తలను రాయొద్దని.. సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని సుద్దాల విన్నవించారు. తనకు ఏం కాలేదని.. బాగానే ఉన్నానని సుద్దాల వివరణ ఇచ్చారు.