Begin typing your search above and press return to search.

మహేష్ కథానాయికకు కవలలు

By:  Tupaki Desk   |   17 Sep 2018 1:22 PM GMT
మహేష్ కథానాయికకు కవలలు
X
లిసా రే.. గుర్తుందా? టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘టక్కరిదొంగ’లో కథానాయికగా నటించిన ఈ భామ.. హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. వివాదాస్పద చిత్రం ‘వాటర్’తో ఆమెకు ప్రపంచ స్థాయిలో పేరొచ్చింది. ఐతే సినిమాలతో.. మోడలింగ్ తో సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో కొన్నేళ్ల కిందట పెద్ద కుదుపు వచ్చింది. లిసా క్యాన్సర్ బారిన పడింది. ఐతే ఆమె ధైర్యం కోల్పోకుండా ప్రాణాపాయ వ్యాధితో పోరాడింది. క్యాన్సర్ చికిత్స కోసం ఆమె జుట్టు మొత్తం తీయించుకుంది. తన ఆత్మ స్థైర్యాన్ని చాటుతూ గుండుతో ఉన్న ఫొటోల్ని కూడా మీడియాకు రిలీజ్ చేసింది. చివరికి క్యాన్సర్ పోరాటంలో ఆమె గెలిచింది. మళ్లీ మామూలు మనిషి అయింది. ఆపై లిసా పెళ్లి కూడా చేసుకుంది. ఇప్పుడామెకు కవల పిల్లలు పుట్టడం విశేషం.

46 ఏళ్ల లిసారే.. 2012లో జేసన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడింది. అప్పటి నుంచి సంతానం కోసం ఆశిస్తున్న లిసారే.. ఎట్టకేలకు తన కోరిక తీర్చుకుంది. ఐతే లిసారే సొంతంగా గర్భం ధరించలేదు. సరోగసీ విధానం ద్వారా ఆమె పిల్లల్ని కన్నది. ఈ రోజే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. ఇద్దరు కవల ఆడ పిల్లలకు తాను తల్లిని అయ్యానంటూ లిసారే చాలా ఎమోషనల్ గా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టింది. తన పిల్లలతో ఉన్న ఒక క్యూట్ ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్-గౌరీ సహా పలువురు ప్రముఖులు సరోగసీ విధానం ద్వారా బిడ్డను కన్నారు. కొందరు గర్భసంచిలో సమస్య ఉండటంతో ఈ విధానాన్ని ఆశ్రయిస్తుండగా.. కొందరు గర్భాన్ని మోయడం సమస్యగా భావించి ఈ దారిలో వెళ్తున్నారు. లిసారేకు గర్భధారణ విషయంలో సమస్య ఉండటంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.