Begin typing your search above and press return to search.

టైసన్‌ ఎంట్రీతో రూ.20 కోట్లు పెరిగిన 'లైగర్‌'?

By:  Tupaki Desk   |   2 Oct 2021 12:30 PM GMT
టైసన్‌ ఎంట్రీతో రూ.20 కోట్లు పెరిగిన లైగర్‌?
X
విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. సినిమాలో కీలక పాత్రకు గాను లెజెండ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్ మైక్‌ టైసన్‌ ను నటింపజేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మైక్ టైసన్ ప్రకటనతో లైగర్ సినిమా స్థాయి అమాంతం పెరిగింది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా గురించిన వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ సమయంలో మైక్‌ టైసన్‌ తో షూటింగ్‌ కు చిత్ర యూనిట్‌ సభ్యులు సిద్దం అవుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మైక్‌ టైసన్ కాంబో సన్నివేశాలు పూర్తిగా యూఎస్ లోనే జరుగబోతున్నాయట. షూటింగ్‌ కోసం మైక్‌ టైసన్‌ దాదాపుగా రెండు వారాల డేట్లను టైసన్ ఇచ్చాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

సినిమాలో టైసన్ వచ్చే సన్నివేశాలు అత్యంత కీలకంగా ఉంటాయని.. అందుకే ఆ సన్నివేశాల కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మైక్‌ టైసన్‌ పారితోషికం మరియు ఆయన నటిస్తున్న సన్నివేశాలు అన్ని కలిపి దాదాపుగా రూ.20 కోట్ల వరకు ఉంటుందని టాక్‌ వినిపిస్తుంది. అంతకు మించి పాతిక కోట్ల వరకు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది కొందరు ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం. మొత్తానికి లైగర్ సినిమా లో మైక్‌ టైసన్ ఎంట్రీ కారణంగా బడ్జెట్‌ భారీగా పెరిగి పోయింది. సొంత సినిమా అవ్వడం వల్ల పూరి ఎంత ఖర్చుకు అయినా వెనుకాడటం లేదు. ఈ సినిమాను బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్ తో కలిసి పూరి ఛార్మిలు నిర్మిస్తున్నారు. కరణ్‌ జోహార్ ఈ సినిమా హిందీ వర్షన్ ను తనదైన స్థాయిలో ప్రమోట్‌ చేసి బజ్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

కరోనాకు ముందు ప్రారంభం అయిన లైగర్ సినిమా వరుస వేవ్స్ ఇతర కారణాల వల్ల షూటింగ్‌ పూర్తి కాలేదు. ఎట్టకేలకు లైగర్‌ ముగింపు దశకు చేరుకుంది. మైక్ టైసన్‌ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేస్తే ప్యాచ్‌ వర్క్ మినహా మొత్తం ముగిసినట్లే అంటున్నారు. రికార్డు స్థాయిలో ఈ సినిమాకు ఖర్చు చేస్తున్న పూరి జగన్నాద్‌ సినిమాపై చాలా నమ్మకంతో కనిపిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ఆయనకు సక్సెస్ ను తెచ్చి పెడుతుందని.. విజయ్ దేవరకొండకు పాన్‌ ఇండియా స్టార్‌ గుర్తింపును తెచ్చి పెడుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఈ క్రేజీ కాంబో ఖచ్చితంగా ఒక సెన్షేషనల్‌ గా నిలుస్తుందా అనేది చూడాలి.