Begin typing your search above and press return to search.

క్యాన్ బాయ్ నుంచి 'కాంతారా' వరకు ఎదిగిన రిషబ్ శెట్టి ..!

By:  Tupaki Desk   |   30 Oct 2022 11:30 PM GMT
క్యాన్ బాయ్ నుంచి కాంతారా వరకు ఎదిగిన రిషబ్ శెట్టి ..!
X
కన్నడ చిత్రం 'కాంతారా' దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ విజయంతో దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతోంది. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడు.. మొదటి ఆఫర్ ఎలా దక్కింది.. అతడి ఫ్యామిలీ విశేషాలు తెలుసుకునేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు.

రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపురలోని కెరాడీ అనే పల్లెటూరులో ప్రశాంత్ శెట్టి జన్మించాడు. భాస్కర శెట్టి-రత్నావతి దంపతులకు ముగ్గురు సంతానం కాగా రిషబ్ శెట్టినే చిన్నవాడు. ఇతడికి ఒక అక్క.. అన్న ఉన్నారు. కుందాపురంలో ఇంటర్ వరకు చేశాడు. చదువుల్లో కంటే ఆటల్లో చురుగ్గా ఉండేవాడు.

కుస్తీ.. జూడో వంటి క్రీడల్లో పతకాల సైతం సాధించాడు. బెంగుళూరులోని బీహెచ్ఎస్ కళాశాలలో చేరాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో కళాశాల స్నేహితులతో కలిసి 'రంగ సౌరభం' అనే బృందంగా ఏర్పడి నాటకాలు చేశాడు. ఈ క్రమంలోనే డిగ్రీ పూర్తి కాకుండానే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరాడు.

డిగ్రీ మధ్యలో మానేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరినందుకు రిషబ్ శెట్టి తండ్రి చాలా కోపగించారు. ఈ సమయంలో తన అక్క ప్రతిభా శెట్టి అన్ని విధాలా అండగా నిలిచింది. తన ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. అయితే పూర్తిగా అక్కపై ఆధారపడకూడదనే ఉద్దేశ్యంతో బెంగళూరులో వాటర్ క్యాన్ సప్లై చేసేవాడు.

ఉదయం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు వెళ్లడం.. రాత్రిళ్లు వాటర్ క్యాన్లు సప్లయ్ వేసేవాడు. ఈ క్రమంలోనే కన్నడ నిర్మాత ఎండీ. ప్రకాష్ తో పరిచయం ఏర్పడింది. అలా 'సైనైడ్' చిత్రానికి సహాయ దర్శకుడిగా చేసే అవకాశం దక్కింది. అయితే ఈ సినిమా మధ్యలో నిలిచిపోవడంతో మళ్లీ వాటర్ క్యాన్ వేసుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత 'గండ హండతి' అనే సినిమాలో క్లాప్ బాయ్ గా అవకాశం వచ్చింది. అయితే ఈ చిత్ర దర్శకుడికి కోపం చాలా ఎక్కువ. ఓ సందర్భంగా కెమెరామెన్ చెప్పినట్లు చేస్తే.. దర్శకుడు తనపై కొప్పడ్డాడు. దీంతో సినిమాలపై విరక్తి చెంది హోటల్ వ్యాపారంలోకి దిగాడు. ఈ వ్యాపారంలో 25 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చింది. దీంతో అప్పులు చేయాల్సి వచ్చింది.

అయితే అప్పులు తీర్చే దారిలేక ప్రశాంత్ శెట్టి మారువేషంలో తిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత సీరియల్స్ అవకాశం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఒక సీరియల్ లో అసిస్టెంట్ దర్మకుడిగా ఛాన్స్ దక్కడంతో రోజుకు రూ.500లకు పని చేశాడు. ఈ సమయంలో అరవింద్ కౌశిక్.. రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది.

రక్షిత్ శెట్టి తొలి సినిమా 'తుగ్లక్' పరాజయం పాలైంది. ఈ సమయంలో తన వద్ద ఉన్న 'రిక్కీ'ను అతడికి చెప్పాడు. ఆ కథ నచ్చడంతో తననే దర్శకుడిగా చేయమన్నాడు. ప్రశాంత్ శెట్టిగా తన పేరును రిషబ్ శెట్టిగా మార్చుకొని 'రిక్కీ' సినిమా చేశాడు. 2కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.

ఆ తర్వాత 'కిరాక్ పార్టీ' మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు వచ్చిన డబ్బులతో 'సర్కారి హిరియా ప్రాథమిక శాలే'.. కాసరగోడు' వంటి చిత్రాలను నిర్మించగా జాతీయ అవార్డు దక్కింది. ఆ తర్వాత 'బెల్ బాటమ్'తో హీరోగా తన కల నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత తన సొంత ఊరి కథను 'కాంతారా'గా తెరకెక్కించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. రిషబ్ శెట్టికి భార్య ప్రగతి శెట్టి, ఒక పాప ఉన్నారు.