Begin typing your search above and press return to search.

ఎందుకు ఇంత ఉలికిపాటు : లక్ష్మీ పార్వతి

By:  Tupaki Desk   |   13 March 2019 7:06 AM GMT
ఎందుకు ఇంత ఉలికిపాటు : లక్ష్మీ పార్వతి
X
రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' మూవీ ఎన్నికల ముందు రాజకీయ వేడిని పుట్టిస్తోంది. నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, ఆయన్ను సొంత కుటుంబ సభ్యులు ఎలా వెన్ను పోటు పొడిచారు అనే విషయాలను తాను ఈ చిత్రంలో చూపిస్తున్నట్లుగా మొదటి నుండి వర్మ చెబుతూనే ఉన్నాడు. ఇతర కుటుంబ సభ్యుల విషయం పక్కన పెడితే ప్రధానంగా చంద్రబాబు నాయుడును ఈ చిత్రంలో విలన్‌ గా చూపించబోతున్నట్లుగా ట్రైలర్‌ మరియు పాటలను చూస్తుంటే అనిపిస్తుంది. అందుకే ఈ చిత్రం విడుదల అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగు దేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే.

ఎన్నికల సంఘానికి తెలుగు దేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంపై లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... సినిమా విడుదల ఆపడం ఏమాత్రం సరికాదు, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఇంత ఉలికిపాటు. నిజాలు బయటకు వస్తే ఏం జరుగుతుందనే భయంతోనే వారు ఈ సినిమాను ఆపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. మరో వైపు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నేను అనుకున్న తేదీకి అంటే మార్చి 22వ తారీకున లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ను విడుదల చేసి తీరుతాను అంటూ వర్మ చెబుతున్నాడు.

తెలుగు దేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలైతే చంద్రబాబు నాయుడు పెద్ద డ్యామేజీ తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. అందుకే తెలుగు దేశం పార్టీ నాయకులు సినిమాను ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.