Begin typing your search above and press return to search.

మహేశ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన సొట్టబుగ్గల సుందరి?

By:  Tupaki Desk   |   16 Nov 2021 6:51 AM GMT
మహేశ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన సొట్టబుగ్గల సుందరి?
X
లావణ్య త్రిపాఠి .. నాజూకైన సౌందర్యానికి నమూనా. 'అందాల రాక్షసి' సినిమాతో ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమైంది. నిజంగానే ఈ పిల్ల అందాల రాక్షసిలానే ఉంది అనుకున్నారు. ఇంత అందం ఇంతకాలం ఎక్కడ అజ్ఞాతంగా ఉందా అని బాధపడ్డారు. ఈ సొట్ట బుగ్గల సుందరికి పొలోమని అవకాశాలు రావడం ఖాయమని చెప్పుకున్నారు. ఆమె నుంచి ఏ సినిమా వచ్చినా మొదటి రోజునే చూసేస్తామని కుర్రాళ్లంతా కలిసి సామూహిక శపథాలు గట్రా చేశారు. అప్పటి నుంచి వాళ్లు మాట తప్పకుండా ఈ పిల్ల సినిమాలకు జట్లుగా వెళుతూనే ఉన్నారు.

లావణ్య త్రిపాఠికి మొదటి నుంచి కూడా గ్లామరస్ పాత్రలు పెద్దగా రాలేదు. గ్లామర్ ఒలకబోయడానికి తనకి అభ్యంతరం ఏమీ లేదని ఆమె చెప్పినా, పద్ధతిగల పాత్రలనే ఇస్తూ వచ్చారు. అలా ఆమె చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' .. ' భలే భలే మగాడివోయ్' .. 'అర్జున్ సురవరం' సినిమాలు ఆమెకి హిట్లతో పాటు మంచి పేరును తీసుకుని వచ్చాయి. ఇక ఈ మధ్య కాలంలో కొత్త కథానాయికలు వరదలా వచ్చేయడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయనే మాట వాస్తవం. ఈ మధ్య చేసిన 'చావుకబురు చల్లగా' సినిమా ఆమెకి సక్సెస్ ను ఇవ్వకపోగా, ఆ పాత్రను ఆమె చేసి ఉండకూడదనే విమర్శలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సినిమా కోసం త్రివిక్రమ్ ఆమెను ఎంపిక చేశాడనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో గతంలో 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు వచ్చాయి. 'అతడు' సినిమా మహేశ్ బాబు కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోయింది. యాక్షన్ తో పాటు ఎమోషన్ ను కూడా మహేశ్ బాబు అద్భుతంగా ఆవిష్కరించగలడు అనే విషయాన్ని నిరూపించిన సినిమా ఇది. ఆ తరువాత ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉండటం వలన, కలిసి చేయడం కుదరలేదు. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజ హెగ్డేను ఫైనల్ చేశారు. మరో కథానాయికగా నభా నటేశ్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా లావణ్య త్రిపాఠి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆమెను తీసుకున్నారనీ .. సెకండాఫ్ లో ఆమె పాత్ర తెరపైకి వస్తుందని అంటున్నారు. ఈ టాక్ నిజమే అయితే లావణ్యకి ఒక మంచి ఆఫర్ పడినట్టే అనుకోవాలి. ఇక త్రివిక్రమ్ తో 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' చేసిన పూజ హెగ్డే, మహేశ్ సరసన నాయికగా 'మహర్షి' చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తో కలిసి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఆమె ఉంది.