Begin typing your search above and press return to search.

'మత్తు వదలారా' దర్శకుడితో లావణ్య త్రిపాఠి యాక్షన్ కామెడీ..!

By:  Tupaki Desk   |   30 Nov 2021 8:56 AM GMT
మత్తు వదలారా దర్శకుడితో లావణ్య త్రిపాఠి యాక్షన్ కామెడీ..!
X
'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అందాల భామ లావణ్యా త్రిపాఠి.. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో 'భలే భలే మగాడివోయ్' 'శ్రీరస్తు శుభమస్తు' 'సోగ్గాడే చిన్ని నాయనా' 'అర్జున్ సురవరం' 'ఏ1 ఎక్స్ ప్రెస్' వంటి విజయాలు అందుకుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ లో మెప్పించిన లావణ్య.. ఇప్పుడు ఓ యాక్షన్ క్రైమ్ కామెడీతో అలరించడానికి రెడీ అయింది.

'మత్తు వదలరా' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రితేష్ రాణా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'మత్తు వదలరా' సినిమాకు పని చేసిన వారందరూ ఈ యాక్షన్-కామెడీలో భాగం అవుతున్నారు. ఇందులో నరేష్ అగస్త్య - సత్య - వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించనున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా.. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని - రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్న ఈ సినిమాకి చిరంజీవి (చెర్రీ) - హేమలత పెదమల్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు మంగళవారం పుజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటుగా దర్శకధీరుడు రాజమౌళి - అగ్ర దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ముహూర్తపు సన్నివేశానికి రాజమౌళి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసారు. కొరటాల - నవీన్ ఎర్నేని - రవిశంకర్ కలసి స్క్రిప్ట్ ను దర్శకుడి చేతికి అందజేశారు. ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమాని సోమవారం అధికారికంగా ప్రారంభించారు. ఇప్పుడు మరో మూవీ కోసం చేతులు కలిపారు.

క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా తన కొత్త సినిమా వివరాలను వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి బ్లాక్ బస్టర్ 'మత్తు వదలారా' దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ అధివాస్తవిక యాక్షన్-కామెడీ కోసం పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. 'మత్తు వదలారా' టీమ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 'సర్రియల్ యాక్షన్ కామెడీ' జానర్లో ఈసారి మజా రెట్టింపు అవుతుంది'' అని మైత్రీ టీమ్ తెలిపారు.

లావణ్య త్రిపాఠి తన కొత్త సినిమా గురించి మాట్లాడుతూ.. స్క్రిప్ట్ తో పాటు తనకు స్క్రీన్ ప్లే బాగా నచ్చిందని తెలిపింది. తన లుక్ చాలా కొత్తగా ఉంటుందని.. క్యారెక్టర్ కోసం మేకోవర్ అవుతున్నానని.. తన పాత్ర ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తుందని లావణ్యా చెబుతోంది. 'మత్తు వదలరా' టీమ్ అంతా కలసి చేస్తున్న ఈ యాక్షన్ కామెడీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.