Begin typing your search above and press return to search.

కథ కంటే భారీ తనం - యాక్షన్ మీదే దృష్టి పెట్టినట్లున్నారే..!

By:  Tupaki Desk   |   28 March 2022 9:30 AM GMT
కథ కంటే భారీ తనం - యాక్షన్ మీదే దృష్టి పెట్టినట్లున్నారే..!
X
కన్నడ హీరో యశ్ - దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'కేజీఎఫ్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. దీంతో ఇప్పుడు చాప్టర్-2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులు మీదుగా నిన్న 'కేజీఎఫ్-2' ట్రైలర్ విడుదలైంది. మొదటి భాగంతో పోలిస్తే.. కాస్టింగ్ పరంగా - బడ్జెట్ విషయంలో రెండో చాప్టర్ మరింత భారీగా కనిపిస్తోంది.

బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ - రవీనా టాండన్ లతో పాటుగా ప్రకాశ్ రాజ్ - రావు రమేశ్ - ఈశ్వరీ రావు వంటి పాపులర్ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. యాక్షన్ - విజువల్స్ - కోలార్ ఫీల్డ్ గనులు - బ్యాగ్రౌండ్ స్కోర్.. అన్నీ అభిమానులను అలరిస్తున్నాయి.

అయితే 'కేజీఎఫ్ 2' అంటే చాప్టర్-1 కంటే పెద్దడిగా ఉండాలని.. భారీ తనం మీదే ఎక్కువ దృష్టి పెట్టారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. పెద్ద షిప్ - జెట్ లతో చాలా గ్రాండియర్ గా తీసినట్లు తెలుస్తోంది. కానీ హీరో పాత్రకు ఎలివేషన్స్ ఇచ్చే సరైన సీన్లు లేకుండా ట్రైలర్ కట్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'కేజీఎఫ్' లో పెద్ద కథ లేకపోయినా.. దానికి మదర్ సెంటిమెంట్ అనేది మూలంగా కనిపించింది. ఫస్ట్ పార్ట్ లో హై వోల్టేజ్ యాక్షన్ - హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ ను ప్రధానంగా చూపించారు. తల్లికి ఇచ్చిన మాట కోసం రాకీ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని భాయ్ గా ఎలా మారాడనేది చూపించబోతున్నారు.

ఈ క్రమంలో అధీరా వంటి భయంకరమైన విలన్లతో ఎలా ఫైట్ చేశాడు.. రాజకీయ నాయకులను ఎలా ఎదుర్కొన్నాడనేది రెండో అధ్యాయంలో ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగించే అంశాలు. కాకపోతే అప్పుడు మొదటి భాగం మీద అంచనాలు లేవు. కానీ ఇప్పుడు చాప్టర్-2 మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీతనాన్ని.. భారీ యాక్షన్ సీన్లనే నమ్ముకున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. పాన్ ఇండియా మోజులో ఇటీవల గ్రాండ్ గా తీసిన సినిమాలు చాలా వరకు కథ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. మరి ఇప్పుడు 'కేజీఎఫ్ 2' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

'కేజీఎఫ్ 2' చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. తెలుగులో వారాహి చలన చిత్రం సంస్థ విడుదల చేస్తోంది.