Begin typing your search above and press return to search.

ఏదైతే అనుకున్నానో అదే జరిగింది: శర్వానంద్

By:  Tupaki Desk   |   5 March 2022 5:30 PM GMT
ఏదైతే అనుకున్నానో అదే జరిగింది: శర్వానంద్
X
శర్వానంద్ - రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' నిన్న థియేటర్లకు వచ్చింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుందంటూ, ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై శర్వానంద్ మాట్లాడుతూ .. "చాలా సంతోషంగా ఉంది .. ఏదైతో అనుకున్నానో అదే జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సినిమా చూశారు. అన్ని ఏరియాల నుంచి సినిమాకి మంచి రిపోర్ట్ వస్తోంది. సాధారణంగా సినిమా చూసిన పదిమందిలో కనీసం ఇద్దరు ముగ్గురైనా ఫలానా సీన్ తమకి నచ్చలేదని చెబుతుంటారు. కానీ ఈ సినిమా చూసిన వారెవరూ కూడా నెగెటివ్ గా చెప్పలేదు. అందరూ కూడా ఈ సినిమా తమకి బాగా నచ్చిందని చెబుతున్నారు.

ఈ సినిమా చూసినవాళ్లలో తమకి నచ్చలేదంటూ నాకు కాల్ చేసినవారు కూడా ఎవరూ లేరు. ఇంత మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కరోనా .. ఈ టెన్షన్ .. ఈ గోలలో పెద్ద కథనేమీ ఆశించి వెళ్లొద్దు.

ఈ సినిమా చూసి ఇది మనింట్లో జరిగే స్టోరీ అనుకుంటే చాలు. నేను ముందుగానే చెప్పాను .. మీ అందరినీ బాగా నవ్విస్తామని. ఆ విషయంలో పాస్ అయ్యామని నమ్ముతున్నాను. ఇంతమందిని నవ్వించగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

నిన్న మా అమ్మవాళ్ల ఫ్రెండ్ ఒకరు ఈ సినిమా చూసి .. ఇలా 'థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తూ హాయిగా నవ్వుకోక ఎన్నాళ్ళైందో' అన్నారట.

చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమాను చూశామని చెప్పారట. ఈ సినిమా నుంచి మేము ఆశించింది కూడా ఇదే. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.