Begin typing your search above and press return to search.

పవన్ తో జోడీకట్టేందుకు రెండుసార్లు నో చెప్పిన పూజ హెగ్డే!

By:  Tupaki Desk   |   22 Feb 2022 4:30 PM GMT
పవన్ తో జోడీకట్టేందుకు రెండుసార్లు నో చెప్పిన పూజ హెగ్డే!
X
సాధారణంగా ఒక స్టార్ హీరో సరసన ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి వెంటనే ఒప్పేసుకుంటుంది. అలాంటిది టాలీవుడ్ లో పవన్ సరసన కథానాయికగా నటించే అవకాశం రెండుసార్లు వచ్చినప్పటికీ పూజ హెగ్డే నో చెప్పిందట. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా పూజ హెగ్డే దూసుకుపోతోంది. ఇదే రేంజ్ లో కోలీవుడ్ తో పాటు హిందీలోను కుదురుకునే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న సినిమాలు వరుస విజయాలను అందుకుంటూ ఉండటంతో, ఇక్కడ ఆమె క్రేజ్ .. డిమాండ్ మామూలుగా లేదు.

పూజ హెగ్డే తన కెరియర్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటుంది. తనకి నచ్చితే మాత్రమే ఒప్పుకుంటుంది .. ఒకసారి ఓకే చెప్పిన తరువాత ఆ పాత్రకి న్యాయం చేయడానికి తనవంతు కష్టపడుతుందనే పేరు ఉంది. మెగా హీరోల్లో చరణ్ .. బన్నీ .. వరుణ్ తేజ్ సరసన నటించిన ఆమెను 'వకీల్ సాబ్'లో శ్రుతి హాసన్ పోషించిన పాత్ర కోసం అడిగారట. అయితే అంతగా ప్రాధాన్యత లేని ఆ పాత్రను చేయలేనని సున్నితంగా తిరస్కరించిందట. ఇక 'హరి హర వీరమల్లు' కోసం అడిగితే, అది కూడా తన క్రేజ్ కి తగిన పాత్ర కాదనే ఉద్దేశంతో నో చెప్పేసిందని అంటున్నారు.

ఇలా పూజ హెగ్డే వదిలేసిన ప్రాజెక్టుల జాబితాలో చాలా సినిమాలే కనిపిస్తాయి. ఇక ఈ బ్యూటీని నితిన్ 'మాస్ట్రో' .. బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్ కోసం అడిగారట. అయితే రీమేకులు చేయడం తనకి ఇష్టం ఉండదని చెప్పిందట. ఇక అంతకుముందు కూడా బెల్లంకొండ 'అల్లుడు అదుర్స్' సినిమా కోసం సంప్రదిస్తే, డేట్లు ఖాళీ లేవని సింపుల్ గా తేల్చేసిందని అంటారు. అయితే ఇటు 'మాస్ట్రో' గానీ .. అటు 'అల్లుడు అదుర్స్' గాని సక్సెస్ కాలేదు గనుక, ఆ సినిమాల విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పచ్చు.

జాన్ అబ్రహం చేసిన 'ఎటాక్' కోసం .. అమితాబ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'గుడ్ బై' కోసం కూడా ముందుగా పూజ హెగ్డేనే అడిగారట. ఆ సమయంలో ఆమెకి అంతకంటే మంచి ప్రాజెక్టులు రావడంతో ఈ సినిమాలు చేయనని చెప్పేసిందని అంటారు. ఇక గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు, ఆ పాత్రకి పూజహెగ్డే కరెక్ట్ అని చాలామంది అనుకున్నారు. శకుంతల పాత్రలో ఆమెను ఊహించుకుని, ఆమెను ఎంపిక చేస్తే బాగుంటుందని భావించారు.

నిజానికి గుణశేఖర్ కూడా ముందుగా పూజ హెగ్డేనే సంప్రదించారట. అయితే ఆ సినిమా కోసం బల్క్ గా డేట్లు కేటాయించవలసి రావడం ఇబ్బంది కావడం .. గతంలో 'మొహంజోదారో' సినిమా విషయంలో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సున్నితంగా నో చెప్పిందట.

మిగతా సినిమాల మాట ఎలా ఉన్నప్పటికీ, 'శాకుంతలం' అవకాశాన్ని వదులుకుని పూజ హెగ్డే పొరపాటు చేసిందని ఆమె అభిమానులు అనుకోకుండా ఉండలేరు. ఇక త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆచార్య' .. 'రాధేశ్యామ్' ఈ బ్యూటీ మార్కెట్ ను మరెక్కడికో తీసుకెళ్లడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగానే వినిపిస్తోంది.