Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ గేమ్ షో పై లేటెస్ట్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   9 July 2021 11:30 AM GMT
ఎన్టీఆర్ గేమ్ షో పై లేటెస్ట్ అప్డేట్..!
X
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 'బిగ్ బాస్' తెలుగు షో ద్వారా బుల్లితెర పై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమాలతో వెండితెరపై ప్రేక్షకులను అలరించిన తారక్.. రియాలిటీ షో తో టెలివిజన్ స్క్రీన్ పై కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మరోసారి బుల్లితెర ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు ఎన్టీఆర్. ఈసారి ''ఎవరు మీలో కోటీశ్వరులు'' అనే గేమ్ షో ద్వారా అలరించడానికి వస్తున్నారు. ఈ మేరకు జెమినీ టీవీతో తారక్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని కోసం ఆయనకు దాదాపు రూ.10 కోట్లు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' టీవీ షో తరహాలో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' గేమ్ షో ఉండబోతోంది. తెలుగులో 'కింగ్' అక్కినేనినాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో మూడు సీజన్లను విజయవంతంగా నడిపించారు. నాలుగో సీజన్‌ కు మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు. ఈ గేమ్ షో నాలుగు సీజన్లు కూడా 'మా టీవీ' లో ప్రసారం అయ్యాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో మాత్రం కొన్ని మార్పులతో జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఇందులో అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పిన వారికి రూ.కోటి ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు.

ఎన్టీఆర్ ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ‘ఇక్కడ కథ మీది కల మీది.. ఆట నాది కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. అలానే ఈ గేమ్ షో కు సంబంధించిన ప్రశ్నలకు కూడా అడిగేశారు. మరికొన్ని రోజుల్లో ఈ షో ప్రారంభం అవుతుందని అందరూ అనుకుంటుండగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ నేపథ్యంలో కోవిడ్ సమయంలో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి కంటెస్టెంట్స్ ని షార్ట్ లిస్ట్ చేయడం నిర్వాహకులకు కష్టంగా మారిందని.. అందుకే ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారని వార్తలు వచ్చాయి. అంతేకాదు అసలు ఈ షోనే రద్దు చేశారని టాక్ వచ్చింది.

అయితే తాజాగా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో ను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే జెమినీ టీవీ వారరు కంటెస్టెంట్స్ ని కూడా షార్ట్ లిస్ట్ చేసారని.. కరోనా ప్రభావం తగ్గడంతో జూలై రెండో వారంలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీని కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ సెట్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఈ నెలాఖరు వరకు షూట్ చేసి వీలైనన్ని ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఆ తర్వాత గేమ్ షో టెలికాస్ట్ అయ్యే తేదీని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇకపోతే 2018లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాతో చివరగా అభిమానులను పలకరించిన ఎన్టీఆర్.. అప్పటి నుంచి రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్ ఆర్' సినిమా చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇటీవల సెట్స్ మీదకు తీసుకొచ్చి.. ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. రామ్ చరణ్ తో కలసి ఒక పాట షూట్ చేస్తే ఎన్టీఆర్ కు సంబంధించిన షూటింగ్ పూర్తైపోతుంది. ఇక కొరటాల శివ '#NTR30' స్క్రిప్ట్ రెడీ చేసి లోపు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో చిత్రీకరణ చేయాలని తారక్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.