Begin typing your search above and press return to search.

పార్కింగ్ డబ్బులు కూడా రాబట్టని 'సన్ ఆఫ్ ఇండియా'!?

By:  Tupaki Desk   |   21 Feb 2022 3:30 PM GMT
పార్కింగ్ డబ్బులు కూడా రాబట్టని సన్ ఆఫ్ ఇండియా!?
X
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ''సన్ ఆఫ్ ఇండియా''. రచయిత డైమండ్ ర‌త్న‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మోహ‌న్‌ బాబు స్వయంగా స్క్రీన్‌ ప్లే సమకూర్చడం విశేషం. మొన్న శుక్రవారం (ఫిబ్రవరి 18) థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజే ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూసింది.

'సన్ ఆఫ్ ఇండియా' సినిమా కనీసం ఒక్క రూపాయి కూడా షేర్ తీసుకురాకపోగా.. నెగిటివ్ షేర్ తీసుకొచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. అయితే మొదటి రోజు మొదటి ఆట నుంచే తిరస్కరణకు గురైన ఈ సినిమా.. రెండు రోజు థియేటర్లకు జనం లేక చాలా చోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఈ మూవీ వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో అంచనా వేయొచ్చు.

డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా ఫస్ట్ డే అంతో ఇంతో కలెక్షన్స్ వస్తుంటాయి.. రెండో రోజు నుంచి పడిపోతుంటాయి. కానీ 'సన్ ఆఫ్ ఇండియా' విషయంలో మాత్రం తొలి రోజే ఊహించని పరాభవం ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కేవలం లక్షల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఈ లెక్కల ప్రకారం థియేటర్ రెంట్ కాదు కదా.. పార్కింగ్ డబ్బులు కూడా రాలేదనే అనుకోవాలి.

రెండో రోజుకు మోహన్ బాబు సినిమా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎక్కడ కూడా ఆడియన్స్ నుంచి ఆశించిన ఆదరణ లభించలేదు. దీంతో లక్షల నుంచి గ్రాస్ వేలల్లోకి పడిపోయిందని తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో మాత్రమే మొదటి రోజు 25 వేల షేర్ తెచ్చుకోగా.. రెండో రోజు 10 వేలతో సరిపెట్టుకుంది. మిగిలిన అన్ని చోట్లా పరిస్థితి దారుణంగా ఉందని బయ్యర్లు వాపోతున్నారు. తెలుగులో ఈ మధ్య కాలంలో ఇంత దారుణమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా ఇదేనని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

ఒకప్పుడు టాలీవుడ్ లో రికార్డ్ స్థాయి వసూళ్లతో కలెక్షన్ కింగ్ అనిపించుకున్న మోహన్ బాబు.. ఇప్పుడు 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంతో నెగిటివ్ షేర్స్ అందుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే. మూడు రోజుల్లోనే థియేటర్ల నుంచి దాదాపుగా కనుమరుగై పోవడం ట్రేడ్ పండితులను అవాక్కయ్యేలా చేస్తోంది. సినిమా ఓపెనింగ్స్ చూస్తే.. ఇది మోహన్ బాబు కెరీర్‌ లోనే అతిపెద్ద పరాజయంగా చెప్పుకోవచ్చు.

కాగా, ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన 'సన్నాఫ్ ఇండియా' చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇందులో మోహన్ బాబు భార్యగా మీనా నటించింది. శ్రీకాంత్ - ప్రగ్యా జైస్వాల్ - తనికెళ్ళ భరణి - ఆలీ - పోసాని కృష్ణమురళి - వెన్నెల కిషోర్ - పృథ్వీరాజ్ - రాజా రవీంద్ర - రఘుబాబు - రవి ప్రకాష్ - మంగ్లీ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు.