Begin typing your search above and press return to search.

ఫ్యామిలీస్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తుంది

By:  Tupaki Desk   |   2 March 2022 11:30 AM GMT
ఫ్యామిలీస్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తుంది
X
విభిన్న‌మైన చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ అభిరుచి గ‌ల నిర్మాత‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు నిర్మాత‌, శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ అధినేత చెరుకూరి సుధాక‌ర్‌. ఆయ‌న నిర్మించిన చిత్రం `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు`. శర్వానంద్ హీరోగా న‌టించారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించారు. ఈ చిత్రం మార్చి 4న శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత చెరుకూరి సుధాక‌ర్ `తుపాకి` మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు.

- `పడి పడి లేచె మనసు` తర్వాత చక్కటి ఫ్యామిలీ సినిమా చేయాలనుకున్నాం. ఆ సమయంలో కిశోర్ దగ్గర కథ వుందని తెలిసి విన్నాం. మేం ఏదైతే అనుకుంటున్నామో అదే ఈ కథ అనిపించింది. వెంటనే సినిమాను ప్రారంభించాలనుకున్నాం. కానీ రష్మిక, ఖష్బూ, రాధిక డేట్స్ వల్ల ఆరునెలలు ఆలస్యమయింది.

- ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు కథ కాబట్టి నాకు బాగా నచ్చింది. పది మంది మహిళలు వున్న కుటుంబంలో ఒకే మగాడు వుంటే అతనిపై వున్న ప్రేమతో అతనికి తెలీకుండా ఇబ్బంది పెట్టే సన్నివేశాలు బాగా చూపించాం. ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పగలను.

- మా సినిమా పాయింట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

- ఒకరకంగా ఇంతమంది నటీనటులతో సినిమా చేయడం సాహసమే అని చెప్పాలి. ఇంతమంది సీనియర్స్‌ తో చేస్తానని అనుకోలేదు. నా కుటుంబసభ్యులతోనే వున్నట్లు అనిపించింది.

- కిశోర్ తిరుమల వినోదంతోపాటు కుటుంబ విలువలను బాగా ఎలివేట్ చేస్తాడు. కిశోర్ అనుకున్న సమయంలో పూర్తి చేయగలడు. అందుకే నటీనటులు డేట్స్ కుదిరాక చేయగలిగాం. కోవిడ్ టైంలోనూ నటీనటుల ప్రోత్సాహంతో పూర్తి చేయగలిగాం.

- శర్వానంద్ తో రెండవ సినిమా. తను నిర్మాతగా కాకుండా సోదరిడిలా ట్రీట్ చేశాడు. `పడిపడి లేచె మనసు` అనుకున్నంతగా ఆడలేదు. అందుకే అప్పటినుంచి మంచి సినిమా వుంటే చేద్దామని అనుకున్నాం.

- సినిమా సక్సెస్ కాకపోయినా బెటర్మెంట్ చేయాలని మరో సినిమా చేశాం. ఏదైనా మన పని మనం నిక్కచ్చిగా చేసుకోవాలి. నిర్మాణంలో పలు విషయాలను నేర్చుకుని ముందుకు సాగుతున్నాను.

- నేను సినిమారంగంలోకి ఇష్టంతోనే వచ్చాను. యు.ఎస్.లో ఐటీ కంపెనీ వుండేది. కుమార్తె పుట్టాక ఇండియా వచ్చేశాం. ఎర్నేని నవీన్, 14 రీల్స్ వారు అంతా స్నేహితులే.

- `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రం కోవిడ్ తర్వాత కుటుంబాలను థియేటర్కు తీసుకు వస్తుందనే నమ్మకం వుంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ పెద్దమ్మలు, చిన్నమ్మలు, బామ్మలు, తల్లి దండ్రులు వుంటారు. నా కుటుంబంలోనూ ఇటువంటి వారున్నారు. నేనూ కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా చూశాక ప్రతివారూ ఎక్కడోచోట కనెక్ట్ అవుతారు.

- ఈ చిత్రం లో ఫ్యామిలీ డ్రామాతో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ వుంటుంది. హీరో హీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలు వినోదాన్ని పండిస్తాయి. ఇక సత్య, వెన్నెల కిశోర్, ప్రదీప్ రావత్ పాత్రలు మరింత ఎంటర్టైన్ చేస్తాయి.

- ఈ చిత్ర కథ రాజమండ్రిలో నేప‌థ్యంలో జరుగుతుంది. అందుకే ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన అన్నవరం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో షూట్ చేశాం.

- ఇంతకుముందు `పడిపడి..` సినిమాను 33 కోట్లతో తీశాం. ఆ తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నా. మరో మంచి సినిమా తీయాలనే ముందడుగు వేస్తున్నా. అందుకే వరుసగా నాలుగు సినిమాలను తీయగలుగుతున్నా. ప్రొడక్షన్ పరంగా శ్రీకాంత్ సహకారం ఎంతో వుంది.

- నిర్మాత గా డ్రీమ్ అనేవి వుంటాయి. మంచి సినిమా చేయడమే ప్రస్తుతం ముందున్నది.

- నేను చేయబోయే సినిమాలు ఒక్కోటి ఒక్కో భిన్నమైన కథలతో రూపొందుతున్నాయి. రవితేజతో `రామారావు ఆన్ డ్యూటీ` సిన్సియర్ కలెక్టర్ నేపథ్యంలో సాగుతుంది. రానా `విరాటపర్వం` 1945 నక్సల్స్ బ్యాక్ డ్రాప్ , నాని `దసరా` చిత్రం వినూత్నమైన అంశం. గోదావరిఖని బ్యాక్ డ్రాప్ కథ. సెట్ కూడా వేస్తున్నాం.

- రష్మిక ను కథ ప్రకారం ఆమె బాగుంటుందని ఎంపిక చేశాం.

- దేవీశ్రీ ప్రసాద్ నాలుగు పాటలు అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు. ఆదరణ పొందాయి. ఐదవ పాట కూడా వుంది. అది నేరుగా సినిమాలో చూస్తే మరింత బాగుంటుంది.

- సినిమాను అమెరికాలో 300 స్క్రీన్ ల‌లో విడుదల చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణలోనూ ఎక్కువ థియేటర్లలో విడుదలచేస్తున్నాం. అని ముగించారు.