Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా 'మేజర్' రిలీజ్ డేట్ రాబోతోంది..!

By:  Tupaki Desk   |   25 Oct 2021 7:31 AM GMT
పాన్ ఇండియా మేజర్ రిలీజ్ డేట్ రాబోతోంది..!
X
26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ''మేజర్''. టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇందులో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామిగా ఉండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

పాన్ ఇండియా స్థాయిలో పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అడివి శేష్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీకరణ జ‌రుగుతోంది. ఇటీవల అనారోగ్యానికి గురై తిరిగి కోలుకున్న శేష్.. రెట్టింపు ఎనర్జీతో ఉత్సాహంతో ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయ్యుంటే ఈపాటికే 'మేజ‌ర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సరైన తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన వెంటనే వీలైనంత త్వరగా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపనున్నారు.

కాగా, 'మేజర్' చిత్రంలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల - బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అబ్బూరి ఈ చిత్రానికి రవి సంభాషణలు రాస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.