Begin typing your search above and press return to search.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కు అన్ని దారులు మూసుకుపోయినట్లే

By:  Tupaki Desk   |   3 April 2019 12:38 PM GMT
లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కు అన్ని దారులు మూసుకుపోయినట్లే
X
వివాదాస్పద 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల్లో విడుదల అవ్వగా ఏపీలో మాత్రం విడుదలకు నోచుకోలేదు. తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా - సీఎం చంద్రబాబు నాయుడును విలన్‌ గా చూపించే విధంగా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం ఉందంటూ ఏపీ హైకోర్టులో పిటీషన్‌ వేసిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమాలు విడుదల అవ్వడం సమంజసం కాదు అంటూ హైకోర్టు స్టే విధించిన విషయం తెల్సిందే. ఏపీలో మినహా మిగిలిన చోట్ల విడుదల చేసుకోవచ్చు అని, సినిమా చూసిన తర్వాత ఏపీలో విడుదల విషయంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు వెళ్లడించిన విషయం తెల్సిందే.

ముందుగా కోర్టు చెప్పిన ప్రకారం నేడు న్యాయమూర్తులు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చూడాల్సి ఉంది. కాని సినిమాను చూసేందుకు నిరాకరించారు. సినిమా ప్రత్యేక ప్రదర్శణకు అంతా ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతానికి సినిమాను చూడలేం అంటూ తేల్చి చెప్పారు. ఇదే సినిమాకు సంబంధించి స్టేను తొలగించాలని నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంను ప్రస్తుతానికి చూడలేం అంటూ న్యాయమూర్తులు చెప్పారు. తదుపరి విచారణ కూడా చేపట్టలేం అని, కేసును ఈనెల 9కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రంను ఎన్నికలు పూర్తి అయ్యే వరకు విడుదల చేసే అవకాశం లేదనిపిస్తుంది. సుప్రీం కోర్టులో స్టే పై విచారణ జరిగి, తీర్పు వచ్చేప్పటికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల్లో విడుదలై ఏపీలో విడుదల కాకపోవడంతో నిర్మాత మరియు బయ్యర్లు కోట్లల్లో నష్టపోతున్నారు. సినిమా ఇప్పటికే పైరసీ అయ్యింది - ఏపీలో ఎన్నికల తర్వాత విడుదల చేస్తే ఫలితం ఉండదు అంటూ బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు.

ఇక మరో వైపు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి సినిమాను కూడా విడుదలైన తర్వాత ఫిల్మ్‌ నగర్‌ లోని ఎఫ్‌ ఎన్‌ సీసీలో ప్రదర్శిస్తారు. కాని ఈ చిత్రం ప్రదర్శణకు అంతా ఓకే అయిన తర్వాత ఒక వర్గం వారు సినిమా ప్రదర్శణకు నో చెప్పడంతో ప్రదర్శణ ఆగిపోయింది. అంతకు ముందు విడుదలైన ఎన్టీఆర్‌ రెండు పార్ట్‌ లను కూడా అక్కడ ప్రదర్శించేందుకు ఒప్పుకున్న వారు, ఇప్పుడు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ను ప్రదర్శించేందుకు మాత్రం నో చెప్పడం - శాశ్వతంగా కల్చరల్‌ సెంటర్‌ లో ప్రదర్శణను నిషేదించడం జరిగిందట. ఇకపై ఎప్పుడు కూడా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంను ప్రదర్శించేందుకు అనుమతించకూడదని నిర్ణయించారు. తెలంగాణలో సినిమా ప్రదర్శణకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా ఫిల్మ్‌ నగర్‌ లో సినిమా ప్రదర్శణను అడ్డుకోవడం పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల విషయం మొత్తం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే విడుదలైన తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల్లో మాత్రం సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చి - మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. విడుదలైన అన్ని ఏరియాల్లో కూడా మంచి షేర్‌ వస్తుందని ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఏపీలో విడుదల ఇంకా ఆలస్యం అయితే కనీసం ప్రింట్స్‌ ఖర్చులు కూడా రావడం కష్టమే అంటూ బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.