Begin typing your search above and press return to search.

దేవిశ్రీ పనైపోయిందా.. ఈ ఫిగర్లు చూడండి

By:  Tupaki Desk   |   3 Dec 2017 12:46 PM GMT
దేవిశ్రీ పనైపోయిందా.. ఈ ఫిగర్లు చూడండి
X
ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఆస్థాన సంగీత దర్శకుడిలా ఉండేవాడు దేవిశ్రీ ప్రసాద్. కానీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత అతడికి టాటా చెప్పేసిన త్రివిక్రమ్.. ‘అఆ’కు మిక్కీ జే మేయర్ తో పని చేశాడు. ఆపై ‘అజ్నాతవాసి’కి అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు కూడా అతడినే కొనసాగించాడు. ‘అజ్నాతవాసి’లో ఒక్క పాటతోనే అనిరుధ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ఇక తెలుగు సినిమాల్లో అతడిదే హవా అని.. దేవిశ్రీ పక్కకు తప్పుకోవాల్సిందే అని కామెంట్లు చేయడం మొదలు పెట్టారు జనాలు. ఈ పరిస్థితుల్లో తనేంటో చూపించడానికి సిద్ధమవుతున్నాడు దేవి.

ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న రెండు క్రేజీ సినిమాలకు దేవిశ్రీనే సంగీతం అందిస్తున్నాడు. అందులో ఒకటి కొరటాల శివ-మహేష్ బాబుల ‘భరత్ అను నేను’ కాగా.. ఇంకోటి సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’. ఈ రెండు సినిమాల ఆడియోల హక్కులకు పలికిన రేట్లు చూస్తే దిమ్మదిరగడం ఖాయం. ‘భరత్ అను నేను’ ఆడియో హక్కులు రూ.2 కోట్లు.. ‘రంగస్థలం’ రైట్స్ రూ.1.6 కోట్లు పలకడం విశేషం. ఈ రెండూ సినిమాల ఆడియోలనూ ‘లహరి’ సంస్థే టేకప్ చేసింది. తెలుగులో నంబర్ వన్ ఆడియో సంస్థ కావాలన్న పట్టుదలతో సాగుతున్న లహరి సంస్థ ఈ రెండు సినిమాలకూ ఫ్యాన్సీ రేటు ఇచ్చి హక్కులు తీసుకుంది. ఈ రెండు సినిమాలకూ దేవినే సంగీత దర్శకుడన్న సంగతి తెలిసిందే. తన స్టామినా మీద సందేహాలు వ్యక్తం చేస్తున్న వాళ్లకు ఈ రెండు సినిమాలతో సమాధానం చెప్పాలనుకుంటున్నాడు దేవి.