Begin typing your search above and press return to search.

మిడతల సమస్య చరిత్ర నుండే రాబోతుంది: బందోబస్త్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   29 May 2020 12:30 AM GMT
మిడతల సమస్య చరిత్ర నుండే రాబోతుంది: బందోబస్త్ డైరెక్టర్
X
ఓ వైపు మనదేశం కరోనా మహమ్మారి నుండి బయట పడటానికి మార్గం తెలియక.. మందు లేక తంటాలు పడుతుంటే.. తాజాగా మరో సమస్య దేశంలోకి చొరబడింది. ఇంతటి కష్టకాలంలో ఇబ్బంది పెడుతున్న సమస్య ‘మిడతల దాడి’. శత్రు దేశమైన పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు మనదేశంలో భారీ నష్టాలను కలిగిస్తూ బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పటికే ఉత్తర రాష్ట్రాలలో వేల ఎకరాల పంటను నాశనం చేసిన ఈ మిడతల దండు, ఇప్పుడు దక్షిణ రాష్ట్రాలకు కూడా రానుందట. ఈ మిడతల భయంతో అటు రైతులు, ఇటు అధికారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ మిడతల దాడి గురించి ఇటీవలే స్టార్ హీరో సూర్య నటించిన బందోబస్తు సినిమాలో దర్శకుడు కేవీ ఆనంద్‌ తెరపై చూపించారు.

గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు మిడతల ఎపిసోడ్‌తో ‘కప్పాన్’ సినిమా మరోసారి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా.. ఈ మిడతల దాడి గురించి ముందే ఊహించి సినిమాలో చూపడానికి రియల్ లైఫ్‌లో తాను చూసిన ఓ నిజ జీవిత సంఘటనే కారణమని డైరెక్టర్ కేవీ ఆనంద్ చెప్పారు. "9 సంవత్సరాల క్రితం సూర్యతో తెరకెక్కించిన బ్రదర్స్ సినిమాకోసం నేను మడగాస్కర్‌ వెళ్లాను. ఆ సమయంలో అక్కడ మిడతలు దాడి చేశాయి. దాని వలన నా కారును రోడ్డుపైనే కొన్ని గంటల పాటు ఆపాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడి స్థానికుల నుంచి మిడతల దాడి గురించి కాస్త సమాచారాన్ని తెలుసుకుని బందోబస్తు సినిమాలో పెట్టాను" అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. 'ఈ సినిమా మొదలుపెట్టకముందే వాటిపై రీసెర్చ్ చేశాం. బైబిల్ - ఖురాన్ లో వాటి గురించి చాలా రిఫరెన్సులు ఉన్నాయి. ఈ మిడతలు వలసపోయేవారు - ప్రజల మనుగడపై చాలా మార్పులు తీసుకొచ్చాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కీటకాలు పెద్ద సంఖ్యలో ఎలుకలను ఆకర్షించి తద్వారా జబ్బును విస్తృతం చేస్తాయి. ఈ మిడతల దాడికి ముంబై ప్రత్యక్ష సాక్ష్యం. 1903 నుంచి 1906లో ఇలా జరిగింది. చరిత్ర ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం వెంటనే అలర్ట్ అయి వాటిని కంట్రోల్ చేయాలి. ఇక మిడతల సంఖ్య పెరగకుండా ఉండేందుకు కూడా ఆనంద్ కొన్ని సూచనలు చేశారు. మగ మిడతల్లో సంతానోత్పత్తికి అవసరమయ్యే వాటిని తొలగించడం ద్వారా వీటి సంఖ్యను తగ్గించొచ్చని, తద్వారా భారీ నష్టాన్ని ఆపొచ్చని" ఆనంద్ తెలిపారు.