Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీ పెద్దలకు 'కౌసల్య కృష్ణమూర్తి' నిర్మాత కౌంటర్‌

By:  Tupaki Desk   |   21 Aug 2019 4:27 AM GMT
ఇండస్ట్రీ పెద్దలకు కౌసల్య కృష్ణమూర్తి నిర్మాత కౌంటర్‌
X
ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రికెట్‌ నేపథ్యం మూవీ 'కౌసల్య కృష్ణమూర్తి' విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ లో రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో పాటు రాశిఖన్నా ఇంకా ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత కేయస్‌ రామారావు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 'కణ' చిత్రం టీజర్‌ చూడగానే నచ్చి తెలుగులో రీమేక్‌ చేయలనుకున్నా. ఒరిజినల్‌ వర్షన్‌ కోసం హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ చాలా కష్టపడింది. రీమేక్‌ కోసం ఆమె అంతకు మించి కష్టపడింది. తెలుగులో తనకు మొదటి సినిమా అవ్వడం వల్ల మంచి పేరు తెచ్చుకోవాలనే పట్టుదలతో ఆమె మరింత కష్టపడింది. ఈ ఏడాది ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ ను ప్రేక్షకులు పొందుతారనే నమ్మకంను వ్యక్తం చేశాడు.

ఎందరో గొప్ప నటీనటులు.. దర్శకులు.. రచయితలు నా బ్యానర్‌ కోసం సినిమాలు చేయడం వల్ల నాకు మంచి వ్యాపారం అయ్యింది. నేను ఒక మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్నానంటే కారణం నా బ్యానర్‌ లో చేసిన నటీనటులు మరియు టెక్నీషియన్స్‌ అన్నాడు. ఈ సినిమాను నేను సొంతంగా విడుదల చేస్తున్నాను. ఏపీలో స్నేహితులతో కలిసి విడుదలకు రెడీ చేశాం. శాటిలైట్‌.. డిజిటల్‌ తప్ప ప్రపంచ వ్యాప్తంగా సినిమాను నేను రిలీజ్‌ చేస్తున్నాను అన్నాడు.

ఈ సినిమాను అమ్మడానికి చాలా ప్రయత్నించాను. కాని బయ్యర్లు దొరకలేదు. ఐశ్వర్య రాజేష్‌ ఏమైనా చిరంజీవినా లేదంటే అమితాబచ్చనా అని వారు భావించి ఉండవచ్చు. సినిమా చూసిన తర్వాత ఆమెంటి.. ఆమె ప్రతిభ ఏంటీ అనేది అందరికి తెలుస్తుంది. ఒక మంచి సినిమాను చేశానన్న తృప్తి అయిన నాకు ఉంది. నా సినిమాను పంపిణీ చేసేందుకు రాని మిత్రులకు కూడా శుభాకాంక్షలు అంటూ ఇండైరెక్ట్‌ గా టాలీవుడ్‌ టాప్‌ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసే వారికి కౌంటర్‌ వేశాడు. పెద్ద హీరోల సినిమాలను చేసేందుకు ముందుకు వచ్చే బయ్యర్లు తమ సినిమాను పట్టించుకోలేదని కేయస్‌ రామారావు ఆవేదన వ్యక్తం చేశాడు.