Begin typing your search above and press return to search.

కృష్ణ‌వంశీ 300 కోట్ల ప్రాజెక్ట్!

By:  Tupaki Desk   |   4 July 2022 4:48 AM GMT
కృష్ణ‌వంశీ 300 కోట్ల ప్రాజెక్ట్!
X
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో కృష్ణ‌వంశీది ఒక ప్ర‌త్యేక అధ్యాయం. తొలి సినిమా గులాబితోనే ప్ర‌కంప‌న‌లు రేపిన‌ ఆయ‌న‌.. ఆ త‌ర్వాత నిన్నే పెళ్ళాడ‌తా, సింధూరం, అంతఃపురం, మురారి, ఖ‌డ్గం లాంటి చిత్రాల‌తో రేపిన సృష్టించిన‌ సంచ‌ల‌నాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఐతే ఎంత పేరున్న ద‌ర్శ‌కుడైనా ఏదో ఒక ద‌శ‌లో ఫామ్ కోల్పోవ‌డం, ట్రెండుకు త‌గ్గ సినిమాలు తీయ‌లేక ఇబ్బంది ప‌డడం మామూలే కాబ‌ట్టి కృష్ణ‌వంశీ కూడా అందుకు మిన‌హాయింపు కాలేక‌పోయారు.

చంద‌మామ త‌ర్వాత ఆయ‌న స్థాయికి త‌గ్గ సినిమాలేవీ రాలేదు. చివ‌ర‌గా ఆయ‌న్నుంచి వ‌చ్చిన న‌క్ష‌త్రం పెద్ద డిజాస్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత రంగమార్తాండ (మ‌రాఠి హిట్ న‌ట‌సామ్రాట్‌కు రీమేక్‌) చిత్రాన్ని నెత్తికెత్తుకుని కొన్నేళ్లుగా పోరాడుతున్నాడు కానీ.. ఆ సినిమా పూర్త‌యి ప్రేక్ష‌కుల ముందుకే రావ‌ట్లేదు. ఈ సినిమాకు బ‌జ్ అంతంత‌మాత్రంగానే ఉంది.

ఇలాంటి ఫామ్‌లో ఉన్న కృష్ణ‌వంశీ ఏకంగా రూ.300 కోట్ల‌తో ఒక ప్రాజెక్ట్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఐతే అది సినిమా కాదు.. వెబ్ సిరీస్ అని, ఓటీటీ కోసం చేయ‌బోయే ప్రాజెక్ట్ అని అంటున్నారాయ‌న‌. ఓ ఇంట‌ర్వ్యూలో కృష్ణ‌వంశీ మాట్లాడుతూ..

ఓటీటీ కోసం ఓ ప్రాజెక్ట్ చేయాల‌నుకుంటున్నా. అన్నీ కుదిరితే ఈ ఏడాదే అది మొద‌ల‌వుతుంది. ఇప్పుడే దాని గురించి వివ‌రాలు చెప్ప‌ను కానీ.. అది చాలా పెద్ద ప్రాజెక్టే అవుతుంది. దాని బ‌డ్జెట్ రూ.200 కోట్ల నుంచి 300 కోట్ల దాకా ఉండొచ్చు.

ఓటీటీల్లో అయితే మ‌నం ఏద‌నుకుంటే అది తీయొచ్చు. నియ‌మ నిబంధ‌న‌లేమీ ఉండ‌వు అని కృష్ణ‌వంశీ పేర్కొన్నారు. ఏదో ఒక ఓటీటీలో చ‌ర్చ‌లు జ‌రుగుతుంటాయి కాబ‌ట్టే కృష్ణ‌వంశీ ఇంత ధీమాగా మాట్లాడుతున్నాడ‌ని.. ఆయ‌న మాట‌ల్ని తేలిగ్గా తీసుకోలేమ‌ని అర్థ‌మ‌వుతోంది. నిజంగా ఇప్పుడున్న ఫాంలో ఇంత బ‌డ్జెట్లో కృష్ణ‌వంశీ ప్రాజెక్ట్ చేశాడంటే అది సెన్సేష‌న్ అవ‌డం ఖాయం.