Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ఆ క‌థ చేసి వుంటే వేరే లెవెల్లో వుండేదా?

By:  Tupaki Desk   |   11 July 2022 2:20 PM GMT
ప్ర‌భాస్ ఆ క‌థ చేసి వుంటే వేరే లెవెల్లో వుండేదా?
X
టాలీవుడ్ చ‌రిత్ర‌లో ఓ హీరో మిస్స‌యిన స్క్రిప్ట్ లు మ‌రో హీరో చేయ‌డం అవి బ్లాక్ బ‌స్ట‌ర్ లు, ఇండ‌స్ట్రీ హిట్ లుగా మారిన సంద‌ర్భాలు చాలానే వున్నాయి. అయితే ఓ హై వోల్టేజ్ యాక్ష‌న్ మూవీ స్టోరీ చెబితే క్రేజీ హీరో మాత్రం భారీ డిజాస్ట‌ర్ స్క్రిప్ట్ ని చేస్తాన‌ని ఏరి కోరి ఎంచుకోవ‌డం ఇంత వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు కానీ ఫ‌స్ట్ టైమ్ లానే జ‌రిగింద‌ని చెబుతున్నారు క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ. దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత `రంగ మార్తాండ‌` సినిమాతో ఆయ‌న సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీ‌కారం చుట్టారు.

మ‌రాఠీలో సంచ‌ల‌నం సృష్టించిన `న‌ట సామ్రాట్‌` సినిమాకు రీమేక్ గా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ నేప‌థ్యంలో ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా `రంగ మార్తాండ‌`కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు కృష్ణ‌వంశీ.

అంతే కాకుండా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో చేసిన `చ‌క్రం` మూవీ సంబంధించి ప‌లు షాకింగ్ విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు. `వ‌ర్షం` వంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ప్ర‌భాస్ స్టార్ డ‌మ్ పెరిగింది. ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో పెరిగారు. ఇలాంటి టైమ్‌లో ఎవ‌రైనా మాసీవ్ యాక్ష‌న్ మూవీ చేయాల‌నుకుంటారు మ‌రి మీరేంటీ ఆధ్యాత్మ‌క‌త నేప‌థ్యంలో జీవిత ప‌ర‌మార్ధాన్ని తెలియ‌జేసే క‌థ‌తో `చ‌క్రం` సినిమా చే సాహసం ఎందుకు చేశారని అడిగితే కృష్ణ‌వంశీ షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు.

`వర్షం` త‌ర్వాత ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌ని క‌లిసి న‌ప్పుడు తన‌కు రెండు కాన్సెప్ట్ లు చెప్పాను. అందులో ఒక‌టి `చ‌క్రం`. మ‌రొక‌టి రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌. గాల్లో జీపులు ఎగ‌ర‌డం, హై వోల్టేజ్ యాక్ష‌న్ సీన్స్... గుప్త నిధుల వేట నేపథ్య క‌థ. అయితే దీన్ని ప‌క్క‌న పెట్టిన ప్ర‌భాస్ `చ‌క్రం`నే చేద్దామ‌న్నాడు. `వ‌ర్షం` త‌రువాత అంతా యాక్ష‌న్ స్టోరీస్ తోనే వ‌స్తున్నార‌ని, మీతో సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీ చేస్తేనే బాగుంటుంది అన్నారు. అలా `చ‌క్రం` క‌థ‌ని పైన‌ల్ చేయ‌డంతో అదే చేయాల్సి వ‌చ్చింది` అని కృష్ణ‌వంశీ తెలిపారు.

వ‌ర్ఫం, అడివి రాముడు వంటి హిట్ సినిమ‌ల‌తో స్టార్ గా ప్ర‌భాస్ ఎదుగుతున్న క్ర‌మంలో `చ‌క్రం` ఆయ‌న కెరీర్ లో భారీ డిజాస్ట‌ర్ గా నిలిచి షాకిచ్చింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. హీరో చ‌నిపోవ‌డం ఏంటి? అంటూ పెద్ద ఎత్తున ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీపై విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఇప్ప‌డు కృష్ణ‌వంశీ ఆ సినిమా చేయ‌డం త‌న త‌ప్పు కాద‌ని, ప్ర‌భాస్ వ‌ల్లే ఆ సినిమా చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్ప‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. `చ‌క్రం` కాకుండా కృష్ణ‌వంశీ చెప్పిన రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేసి వుంటే వేరే లెవెల్లో వుండేది క‌దా అని ఫ్యాన్స్ ఇప్ప‌డు ఫీల‌వుతున్నార‌ట‌.