Begin typing your search above and press return to search.

అడవి నేపథ్యంలో సాగే మరో కథతో క్రిష్ .. హీరోగా వెంకటేష్?

By:  Tupaki Desk   |   7 Oct 2021 3:30 AM GMT
అడవి నేపథ్యంలో సాగే మరో కథతో క్రిష్ .. హీరోగా వెంకటేష్?
X
క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కొండ పొలం' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. వైష్ణవ్ తేజ్ .. రకుల్ జంటగా నటించిన ఈ సినిమాలో, కోట - సాయిచంద్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అడవి నేపథ్యంలో సాగే కథ ఇది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచన 'కొండ పొలం' ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో అడవిలోని గిరిజనుల సమస్య ఉంటుంది. ఆ కథకి ఒక అందమైన ప్రేమకథను క్రిష్ జోడించాడు. అలా మరింత ఆసక్తికరమైన అంశాలను ఈ కథ సంతరించుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది.

క్రిష్ కి తెలుగు సాహిత్యంపై ఇష్టం ఎక్కువ. అందువలన ఆయన నవలలు ఎక్కువగా చదువుతూ ఉంటాడు. తన స్నేహితులతో కూడా ఆయన పుస్తకాలను గురించే ఎక్కువగా మాట్లాడుతుంటాడు. అందువల్లనే 'కొండ పొలం' పుస్తకం ఆయన దృష్టికి రావడం .. ఆ కథలోని పాత్రల స్వభావాలను ఆయన అంతగా పట్టుకోవడం జరిగింది. ఒకప్పుడు యండమూరి నవలలు .. యద్దనపూడి సులోచన రాణి నవలలు సినిమాలుగా వచ్చాయి. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తరువాత కాంబినేషన్ ను ముందుగా సెట్ చేసి, అందుకు తగిన కథను వాళ్ల చుట్టూ అల్లుకోవడం మొదలైంది.

ఇలాంటి ట్రెండ్ మొదలైన తరువాతనే నవలలోని కథలు .. ఆ పుస్తకాల్లోనే ఉండిపోయాయి. చాలా గ్యాప్ తరువాత క్రిష్ మళ్లీ నవలా సాహిత్యంలోని గొప్పతనాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాన్ని 'కొండ పొలం'తో మొదలుపెట్టాడు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అంతా హర్షాన్ని .. అభినందనలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరో నవల ఆధారంగా ఒక సినిమాను చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడని అంటున్నారు. ఆ కథ కూడా అడవి నేపథ్యంలో నడిచేదే .. ఆ నవల పేరే 'అతడు అడవిని జయించాడు'. డాక్టర్ కేశవరెడ్డి కలం నుంచి జాలువారిన ఈ కథ .. తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది.

చూడటానికి ఒక సామాన్యుడి జీవితం .. వినడానికి ఒక సాధారణమైన లైన్ అనిపిస్తుంది. కానీ అన్ని వైపులా నుంచి అలుముకున్న ఒక సమస్య నుంచి .. ఆపద నుంచి కథానాయకుడు ఎలా బయటపడ్డాడు? అందుకోసం ఆయన చేసిన ఆలోచన ఏమిటి? చివరికి అతను సాధించినదేమిటి? అనేది ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. గతంలోనే క్రిష్ ఈ కథను కదిలిస్తున్నటుగా వార్తలు వచ్చాయి. 'కొండ పొలం' కథకి పెరుగుతున్న ఆదరణ చూసిన క్రిష్, మరోసారి 'అతడు అడవిని జయించాడు' పై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాను ఆయన వెంకటేశ్ తో చేయాలనుకుంటున్నాడనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఈ కథలోని ప్రధానమైన పాత్రకి ఆయన బాగా సెట్ అవుతాడు కూడా. అంతేకాదు ఈ కథలోని పాత్ర .. 'నారప్ప' పాత్రకి దగ్గరగా అనిపిస్తుంది. 'నారప్ప' పాత్రను అద్భుతంగా పండించిన వెంకటేశ్ అయితే ఈ పాత్రకి పూర్తి న్యాయం చేయగలుగుతాడని క్రిష్ భావించి ఉండొచ్చు. ఇందులో వాస్తవమెంతన్నది తెలియదుగానీ, ఈ వార్త అయితే ఫిల్మ్ నగర్లో జోరుగానే వినిపిస్తోంది. ఒకవేళ నిజమే అయితే ఆ రచయితను .. వెంకటేశ్ ను క్రిష్ సంప్రదించారా లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.