Begin typing your search above and press return to search.

#CHIRU 152 .. చంద‌మామ‌కు స్వీటీ ఎర్త్ పెట్టింద‌ట‌గా!

By:  Tupaki Desk   |   16 March 2020 5:03 AM GMT
#CHIRU 152 .. చంద‌మామ‌కు స్వీటీ ఎర్త్ పెట్టింద‌ట‌గా!
X
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా క‌థానాయిక వేట ప్ర‌స్తుతం అభిమానులు.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొరటాల శివ చాలా కాలంగా జ‌ల్లెడ వేస్తున్నా చేప చిక్క‌డం లేదు మ‌రి. `ఆచార్య` అనే పేరును ఖరారు చేసేసిన చిరు నాయిక కోస‌మే వెయిటింగ్. ఇక ఈ సినిమాని దేవాదాయ శాఖ కుంభ‌కోణం నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. సామాజిక సందేశం.. వినోదం మేళవింపు గా ఈ సినిమా ఉంటుందని.. ఇందు లో రామ్‌చరణ్ లేదా మ‌హేష్ ల‌లో ఎవ‌రో ఒక‌రు కీలక పాత్రలో నటించబోతున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌రు? అన్న‌దే స‌స్పెన్స్ గా మారింది.

ఇటీవ‌ల‌ త్రిష తప్పకున్న త‌ర్వాత సీన్ మ‌ళ్లీ మొద‌టికే రావ‌డం క‌ల‌వ‌ర‌పెట్టేస్తోంది. క్రియేటివ్‌ డిఫరెన్స్ కారణంగా తాను తప్పుకుంటున్నట్టు త్రిష ట్వీట్‌ చేసింది. ఇందులో చరణ్‌ సరసన మరో హీరోయిన్ ని తీసుకోబోతుండటం.. చిరుతో చేస్తే యంగ్‌ హీరోలతో ఛాన్స్ లు రావనే భయంతో ఆమె తప్పుకున్నట్టు సోషల్‌ మీడియా లో ప్ర‌చార‌మైంది. మరి త్రిష స్థానంలో ఎవరిని తీసుకుంటారనే చర్చ ఆసక్తికరంగా జరుగుతుంది.

ఆ ఛాన్స్ చందమామ కాజల్ ని వరించినట్టేన‌ని ఇటీవల అన్ని మీడియా మాధ్య‌మాల్లో ప్ర‌చార‌మైంది. రెండు రోజులు కాజ‌ల్ పేరే వైరల్‌ అయ్యింది. చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటించిన `ఖైదీ నం.150`లో ఆయనకు జోడిగా కాజల్‌ నటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కాజల్ ని రిపీట్ చేస్తార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇందులో వాస్తవం లేదని తాజాగా అస‌లు విష‌యం బయటకు వచ్చింది. చిరంజీవి సరసన అనుష్కని ఎంపిక చేసే ఆలోచనలో కొరటాల శివ ఉన్నారట. స్వీటీ అయితే చిరుకి పర్ ఫెక్ట్ జోడి అవుతుందని భావిస్తున్నారట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు కాజల్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సెట్‌ అయితే చిరు- అనుష్క కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ సినిమా అవుతుంది. `స్టాలిన్‌`లో ప్రత్యేక సాంగ్ లో అనుష్క ఆడిపాడిన విషయం విదితమే. కానీ హీరోయిన్ గా ఇంత‌వ‌రకూ ఏ సినిమాలోనూ చేయలేదు.

మరో వైపు చరణ్‌ సరసన హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనేది మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి తో కలిసి రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కరోనా వైరస్ ఉత్పాతం కారణంగా షూటింగ్‌ వాయిదా వేశారు. ప్రభుత్వం అన్నింటిని బంద్‌ చేసిన నేపథ్యం లో వెంటనే చిరు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక అనుష్క ప్రస్తుతం `నిశ్శబ్దం` చిత్రం లో నటిస్తుంది. సస్పెన్స్ హర్రర్‌ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వచ్చే నెలలో విడుదలకానుంది.